అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విధానాల అమలుతో వ్యర్థాల నుంచి సంపద (వెల్త్ ఆఫ్ వేస్ట్)ను సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది. నాగోల్లోని ఫతుల్లాగూడలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించిన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పారిశుధ్య నిర్వహణలో వచ్చిన విప్లవాత్మక మార్పులను ఆసక్తికరంగా వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో నాగరిక-పర్యావరణహితంగా బహుముఖ ప్రయోజనాలు ఎలా ఉన్నాయనేది గతంతో పోలుస్తూ చెప్పారు. ఆ వివరాలను పరిశీలిస్తే..
హైదరాబాద్, జూన్ 25 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్తంగా నాగోల్లోని ఫతుల్లాగూడలో ఏర్పాటుచేసిన భవననిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టన్ను వ్యర్థాల తరలింపునకు నామమాత్రంగా రూ.342 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేస్తే సిబ్బంది వచ్చి తీసుకెళ్తారని చెప్పారు. సొంత వాహనంతో వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్కు తీసుకొస్తే టన్నుకు రూ.85.5 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన జీడిమెట్ల, ఫతుల్లాగూడలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ప్లాంట్తో పాటు మరో రెండు వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. సమగ్ర ప్రణాళికతో వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నట్టు తెలిపారు. ఢిల్లీ, అహ్మదాబాద్ తర్వాత హైదరాబాద్లోనే సీ అండ్ డీ(కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్) ప్లాంటులు ఉన్నాయని చెప్పారు.
రీసైక్లింగ్ ద్వారా వచ్చే మెటీరియల్ను ఫుట్పాత్, రోడ్డు సబ్బేస్ల నిర్మాణాలకు ఉపయోగించుకొవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, కెర్బ్స్టోన్స్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ తయారు చేయవచ్చని అన్నారు. జీహెచ్ఎంసీ ఏప్రిల్ 2018 నుంచి ఇప్పటి వరకు 15.26 లక్షల టన్నుల వ్యర్థాలను సేకరించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాసగుప్తా, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, రాంకీ గ్రూప్ ఎండీ గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మాదిరిగా వరంగల్, ఇతర పట్టణాల్లో క్లస్టర్ల తరహాలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీనంబర్ 18001201159 అందుబాటులోకి తెచ్చామని అన్నారు. జీడిమెట్ల ప్లాంట్లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఫతుల్లాగూడ ప్లాంట్లో కూడా రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్లో రోజుకు 2 వేల టన్నుల వ్యర్థాలను పునర్వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్మాణ వ్యర్థాలలో 90 శాతం మళ్లీ ఉపయోగంలోకి వస్తుందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, బిల్డర్లకు వీటిపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎల్బీనగర్లో రూ.450 కోట్లతో ఎస్సార్డీపీ పనులు కొనసాగుతున్నాయని, రూ.858 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులను చేపడుతున్నామని వివరించారు. చెత్త నుంచి 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్లాంట్ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. పొడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, తడి చెత్త నుంచి ఎరువు తయారీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.