హైడ్రాలిక్ అటాచ్మెంట్ టు ట్రాక్టర్.. రాతి వ్యర్థాలను తొలగించే లోకాస్ట్ మల్టీ పర్పస్ యంత్రం.. రైతులకు తక్కువ ఖర్చుతో ఉపయోగపడేలా స్ప్రెయర్.. ఇలా అద్భుతమైన ఆవిష్కరణలతో ఔరా అనిపించారు గ్రామీణులు. సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్న టీహబ్లో బుధవారం పించ్ ఇన్ ద రింగ్ – మన ఇన్నోవేటర్ కథలు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గ్రామీణ నేపథ్యం కలిగిన వారు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలు అబ్బురపరిచాయి. రైతాంగానికి మేలు చేసేవే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఔత్సాహికులను విశేషంగా ఆకర్షించాయి. కొందరు మార్కెటింగ్ మద్దతు అందించేందుకు ముందుకొస్తే.. మరికొందరు ఉత్పత్తుల తయారీకి పెట్టుబడులు పెడతామని అభయమిచ్చారు.
గ్రామీణుల వినూత్న ఆవిష్కరణలకు మాదాపూర్లోని టీ హబ్ పేజ్- 2 వేదికైంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో “మన ఇన్నోవేటర్స్ కథలు” పేరిట బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామీణుల ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సమస్య మీది.. పరిష్కారం మాది అన్నట్లుగా రైతులు, వృద్ధులు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు చక్కటి పరిష్కారమార్గాలను చూపారు. 16 నుంచి 70 ఏండ్ల వయస్సున్న వారు సైతం ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు ముందుకు వచ్చి.. టీ హబ్ వేదికగా జరిగిన “పించ్ ఇన్ ద రింగ్- మన ఇన్నోవేటర్ కథలు” కార్యక్రమంలో ప్రదర్శించారు. ప్రత్యక్షంగా ఆవిష్కర్తల మాటలను విన్న పెట్టుబడిదారులు వారిలో పట్టుదలను చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఎంపిక చేసిన 23 గ్రామీణ ఆవిష్కరణల్లో 21 ఆవిష్కరణల వివరాలను పెట్టుబడిదారులు ఆసక్తిగా తెలుసుకున్నారు. మొత్తం 49 మంది ఆయా ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని టీఎస్ఐఐసీ ప్రతినిధి ప్రణయ్ తెలిపారు. కొంతమంది మార్గదర్శకులుగా, మార్కెటింగ్ మద్దతు అందించేందుకు స్పాన్సర్లుగా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) :
గ్రామీణ ఆవిష్కర్తలను ప్రోత్సహించాలి
గ్రామీణ ఆవిష్కర్తలు వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆవిష్కరణలు రూపొందించారు. తమ చుట్టూ ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి ఈ ఆవిష్కరణలకు రూపమిచ్చారు. ఇలాంటి ఆవిష్కరణలను పెట్టుబడిదారులు ప్రోత్సహించాలి. వీరిని ప్రోత్సహిస్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఎంతో పట్టుదలతో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, గ్రామాలకు తెలిసేలా చేసి, ఈ రోజు అత్యుత్తమైన 23 గ్రామీణ ఆవిష్కర్తలను మీకు పరిచేయం చేసింది. పెట్టుబడిదారులు మరింత సమాచారం కోసం, సందేహాల నివృత్తి కోసం గ్రామీణ ఆవిష్కర్తలతో సమావేశమైన తర్వాతనే పెట్టుబడుల గురించి ఆలోచించండి. ఇది ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించండి. ఒక సమస్యను పరిష్కరించడం ద్వారా సమాజంలో ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆవిష్కర్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.
గ్రామీణ ఆవిష్కరణలు ప్రజలందరికీ చేరేలా గ్రామీణ ఆవిష్కర్తలు.. సమాజానికి మార్గదర్శకులు!
రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు, ఆవిష్కరణలకు విసృత్తంగా ప్రాచూర్యం కల్పించేందుకు “పించ్ ఇన్ ద రింగ్- మన ఇన్నోవేటర్ కథలు” కార్యక్రమాన్ని టీహబ్లో నిర్వహించాం. టీ హబ్ వేదికగా ఎన్నో స్టార్టప్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. అలాంటి టీ హబ్లో గ్రామీణ ఆవిష్కరణలు వినియోగించే ఉత్పత్తులు రూపొందించేందుకు, వాటికి విసృత్తంగా మార్కెట్ చేసేందుకు ఆర్థిక సహకారం అవసరం. ఇందుకోసం 100 మంది వరకు పెట్టుబడి దారులను ఈ కార్యక్రమానికి తీసుకువచ్చి వారితో గ్రామీణ ఆవిష్కర్తలను పరిచయం చేశాం.
– డాక్టర్ శాంతా తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, టీఎస్ఐఐసీ
కదల్లేని వారికి.. చేయూతనిచ్చేలా!
జగిత్యాల జిల్లాకు చెందిన అల్లాడి ప్రభాకర్ “సీఓటీ, బెడ్ రిడెన్ పేషెంట్” అనే పేరుతో ఓ బెడ్ను తన ఆవిష్కరణలో భాగంగా రూపొందించాడు. ఈ బెడ్ కోమా, ఆర్థోపెడిక్ పేషెంట్తో పాటు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. హ్యాండ్ వాష్, బాత్ రూంతో పాటు ఎవరి సహాయమూ లేకుండా కూర్చో గలిగేలా, పడుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు దేశంలో 4 వేలకు పైగా బెడ్లను విక్రయించినట్లు ఆయన తెలిపాడు. దీని ధర రూ.26 వేల వరకు ఉంటుందన్నాడు. పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉన్నవారికి దీని పేటెంట్ హక్కులను ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. అమెజాన్లో సైతం దీన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నాడు.
గాలి, నీరుతో మోటార్ల ఆన్, ఆఫ్
పంటపొలాల్లో ఏర్పాటు చేసిన మోటార్లను ఆన్, ఆఫ్ చేయాలంటే స్వయంగా రైతులు మోటార్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ “ఆటోమెటిక్ రోబో టు టర్న్ ఆన్, ఆఫ్ మోటర్ యూజింగ్ ఎయిర్ అండ్ వాటర్ సిస్టమ్”ను కనుగొన్నాడు. ఈ సిస్టమ్తో రైతులు మోటార్ల వద్దకు వెళ్లకుండానే ఉన్నచోట నుండే సులభమైన పద్ధతిలో ఆపరేటింగ్ చేసుకునేలా ఓ డివైజ్ను ఏర్పాటు చేశాడు. ఈ డివైజ్ కరెంట్, సెన్సార్, సోలార్ అవసరం లేకుండానే కేవలం గాలి, నీరు ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని ఫ్యాక్టరీలు, వ్యవసాయం, చెరువుల వద్ద ఉపయోగించవచ్చు. పైగా పంట పొలాల్లో మోటార్ ఎంత సేపు నడవాలో టైమ్ సెట్ చేస్తే మనం సెట్ చేసే సమయానికి ఆటోమెటిక్గా ఆఫ్ అయ్యేలా టైమర్ ఉంటుంది. దీని సాయంతో మోటార్లను సెట్ చేసిన సమయానికి ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు.
చిరుధాన్యాలతో..
నిజామాబాద్కు చెందిన శ్రీదేవి పౌష్టికాహరాన్ని ప్రతి ఇంటికి అందించాలన్న సంకల్పంతో ఎన్నో ప్రయోగాత్మక, పరిశోధనాత్మక విధానాలను అనుసరించి “మిల్లెట్ బేస్డ్ న్యూట్రిషన్” ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇంటింటా ఇన్నోవేషన్ అండతో శిక్షణ తీసుకొని అందులో ఆంగ్లాన్ని నేర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవనంలో చాలా మందికి తినేందుకు సైతం సమయం ఉండటం లేదు. అటువంటి వారికి ఎంతో ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు, తృణధాన్యాలతో కలిపి తయారు చేసిన పదార్థాలను ఇన్స్టెంట్ ఫుడ్గా తినేలా తయారు చేసింది. అంతేకాకుండా క్రీడాకారులు, షుగర్, బీపీ రోగులకు ఎటువంటి ఆహారం ఇవ్వాలో స్వయంగా పరిశోధనలు చేసి ఆరోగ్యకరమైన, రుచికరమైన పదార్థాలను తయారు చేస్తున్నది. ఎల్వీ ప్రసాద్ సంస్థ నుంచి ఇప్పటికే తనకు ఆర్డర్ వచ్చినట్లు ఆమె చెప్పారు.
తక్కువ ఖర్చుతో అగ్రికల్చర్ టూల్స్ అండ్ స్ప్రేయర్
సూర్యాపేట జిల్లాకు చెందిన గొర్రె అశోక్ అగ్రికల్చర్ టూల్స్ అండ్ స్ప్రేయర్ను కనుగొన్నాడు. రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి తక్కువ ఖర్చులో అగ్రికల్చర్ టూల్స్ అండ్ స్ప్రేయర్ అందించాలన్న లక్ష్యంతో ఈ సిస్టమ్ను తయారుచేశాడు. మందులను పిచికారీ చేయాలంటే ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇందులో భాగంగా రైతులు తక్కువ ఖర్చుతో స్ప్రే చేయడానికి దీనిని కనుగొన్నాడు. ఇప్పటి వరకు 7 చోట్ల విజయవంతంగా ప్రదర్శించినట్లు చెప్పాడు.
తక్కువ విద్యుత్.. తక్కువ నీరు
రంగారెడ్డి జిల్లాకు చెందిన గోపాల్ సింగ్ “మెకానికల్ టర్న్ ఆన్, ఆఫ్ కంట్రోలర్ సిస్టమ్”ను కనుగొన్నాడు. వ్యవసాయ రంగంలో చాలా మంది రైతులు డ్రిప్ సిస్టమ్ను వినియోగించుకోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. కాని నీరు వృథా కాకుండా వాల్వ్ సిస్టమ్ తయారు చేశాడు. దీంతో తక్కువ విద్యుత్తో పాటు తక్కువ నీరు అవసరం అవుతుంది.