ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలుగు యూనివర్సిటీ, జనవరి 27: మాతృభాషలను పరిరక్షించుకుంటూనే బహు భాషలలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ విద్యార్థులకు సూచించారు. కన్నడ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణ, గోవా రాష్ర్టాలలో కన్నడ మీడియం చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలం ప్రాంగణంలో గల ఆడిటోరియంలో శనివారం అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ ప్రసంగిస్తూ ఆంగ్ల భాష ప్రభావం నేటి సమాజంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కన్నడ మీడియంలో విద్యనభ్యసించి అత్యుత్తమ ఫలితాలను సాధించడం అభినందనీయమన్నారు. మాతృభాషలో పట్టు సాధిస్తూనే ఇతర భాషలను నేర్చుకుని పోటీ ప్రపంచంలో రాణించి ఉపాధి అవకాశాలను పొందాలని అన్నారు. కన్నడ డెవలప్మెంట్ అధారిటీ సెక్రటరీ సంతోష్ హంగల్, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ సి.నంజున్దయ్య, కన్నడిగాస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మేంధ్ర పుజారి, కర్ణాటక శిక్షణ సమితి కార్యదర్శి ముకుంద్ కులకర్ణి, మరఠ్వాడ-కన్నడ సంఘ్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ తెలంగ్ పాల్గొన్నారు.