హయత్నగర్, మార్చి 8: తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తూ.. ఎన్నో మార్పులు తీసుకువస్తున్నది. ఆర్టీసీ సేవలను మరింతగా విస్తృతం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తూ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని చేరువ చేసింది. కాగా, కరోనా కాలంలో కొంతమేర ఇబ్బంది పడ్డ ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలను అందిస్తున్నది. రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో నూతన విధానాలను అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే వస్తు, సామగ్రిని ట్రాన్స్పొర్ట్ చేసేందుకుగానూ కార్గో సేవలను అమలులోకి తీసుకువచ్చింది. ప్రజలు అందజేస్తున్న పార్సిళ్ల ద్వారా ఆర్టీసీకి మరింత ఆదాయం పెరుగుతున్నదని చెప్పవచ్చు. ఆటోనగర్ పార్సిల్ కౌంటర్ వద్ద రోజుకు రూ.20 నుంచి 25 వేలు ఆదాయం వస్తుంది. హయత్నగర్ బస్టాండ్ పార్సిల్ కౌంటర్ వద్ద రోజుకు రూ.3 నుంచి 5 వేలు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతుంది. ఈ సేవలు హయత్నగర్ డిపో-1 ద్వారా విజయవంతంగా కొనసాగిస్తుండటంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. నగరంలోనే హయత్నగర్ డిపో కార్గో సేవల్లో మొదటి స్థానంలో నిలుస్తోందని ఆర్టీసీ ఉన్నతాధికారులు సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.
హయత్నగర్ డిపో -1 పరిధిలో కార్గో సేవలు విస్తృతం అవుతున్నాయి. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆటోనగర్, హయత్నగర్ బస్టాండ్ ప్రాంతాల్లో ఇద్దరు చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేసుకుని బుకింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మరో తొమ్మిది ప్రైవేట్ కేంద్రాల ద్వారా ఈ సేవలను కొనసాగిస్తున్నారు. వాటిల్లో 1. ఎల్బీనగర్, 2. పల్లవి గార్డెన్, 3, రాజధాని హోటల్ అపోజిట్, 4. ఆటోనగర్, 5. హయత్నగర్ సన్రైజ్ ఆస్పత్రి ఎదురుగా, 6. వర్డ్ అండ్డిడ్ ఎదురుగా, 7. పెద్ద అంబర్పేట, 8. భాగ్యలతా శాంతినగర్, 9. లెక్చరర్స్ కాలనీల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేసుకుని కార్గో సేవలు అందిస్తున్నారు. ఆయా కార్గో సెంటర్ల ద్వారా పార్సిల్స్ను, కొరియర్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో పార్సిల్, కొరియర్ సేవలను తక్కువ సమయంలో, క్షేమంగా అనుకున్న చోటుకు చేరవేస్తున్నారు.
హయత్నగర్ డిపో పరిధిలో ఏర్పాటు చేసిన దాదాపు 200 కార్గో వాహనాల ద్వారా ఆర్టీసీ ట్రాన్స్పోర్టింగ్ సేవలు అందిస్తున్నారు. వాటిల్లో 4 టన్నుల కెపాసిటీ, 10 టన్నుల కెపాసిటీ గల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. పార్సిల్స్ ఎక్కువగా ఉన్నవారి ఇంటికి కార్గో సర్వీసు వెళ్లి పార్సిల్స్ను తీసుకుంటుంది. ఫుల్ బుకింగ్ చేసుకున్న వారికి లోడింగ్ నుంచి అన్లోడింగ్ ప్రాంతం వరకు కార్గో సేవలు నేరుగా అందిస్తున్నారు. రిటైల్ బుకింగ్ చేసుకున్న వారికి గంటల వ్యవధిలోనే పార్సిల్స్, కొరియర్స్ చేరవేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసు సేవల గురించి ఆన్లైన్లో తెలుసుకున్న వినియోగదారులు నేరుగా వచ్చి పార్సిల్ కౌంటర్ వద్ద ఇస్తున్నారు. మరికొంతమంది తమ సొంత వాహనాల్లో తీసుకొచ్చి పార్సిల్స్ను అందజేస్తున్నారు. దూరం, బరువును బట్టి యూనిట్కు 50 కేజీల చొప్పున 5 కిలోల బరువు తూకానికి రూ.60 నుంచి రూ.80 మధ్యలో చార్జిలు వసూలు చేస్తున్నారు. వస్తువును పార్సిల్ చేస్తున్న సమయంలో గానీ, డెలివరీ అవుతున్న చోటనే గానీ చార్జీలు చెల్లించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
ఆర్టీసీ కార్గో సేవలను అందించడానికి ఆయా కాలనీల్లో నిరుద్యోగులకు కాంట్రాక్టు కూడా ఇస్తాం. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు పార్సిల్స్ను క్షేమంగా చేరవేస్తున్నాం. దీంతో హయత్నగర్ డిపోకు ఆదాయం కూడా పెరుగుతోంది. ప్రజలందరూ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – విజయభాను, ఆర్టీసీ డీవీఎం, హయత్నగర్
లాక్డౌన్ తర్వాత ఆర్టీసీ కార్గో సేవలపై ఎల్బీనగర్ నుంచి కొత్తగూడెం వరకు ఇంటింటికీ, షాపు టు షాపునకు, ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో కంపెనీల్లో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాం. దీంతో ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా పార్సిళ్లు, కొరియర్లు పంపేందుకు ప్రజలు అధికంగా ఇష్టపడుతున్నారు. – బొల్లొల్ల నవీన్ కుమార్, ఆర్టీసీ సిబ్బంది
కార్గో సర్వీసుల ద్వారా తక్కువ టైములో సేఫ్టీగా డెలివరీ చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అధిక పార్సిల్స్ ఉన్నవారి ఇంటికే వాహనాన్ని పంపించి పార్సిళ్లను సేకరిస్తున్నాం. తక్కువ టైమ్, తక్కువ ధరలో ప్రజలకు పార్సిళ్లను భద్రంగా చేరుస్తున్నాం. – ఎన్.అమరేందర్ రాజు, ఆర్టీసీ కార్గో ఎగ్జిక్యూటివ్
ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో పార్శిల్స్, కొరియర్ సకాలంలో గమ్యానికి చేరుస్తుండటం సంతోషంగా ఉంది. వ్యాపారస్తులకు, ఇతర రంగాల వారికి వస్తువులను చేరవేయడంలో ఆర్టీసీ సిబ్బంది సేవలు మరువలేనివి. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో పార్సిల్స్ను క్షేమంగా గమ్య స్థలానికి చేర్చుతున్నారు.- బెలిదె క్రాంతి కుమార్, వ్యాపారి, హయత్నగర్