మారేడ్పల్లి, ఆగస్టు 19: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని టీఎస్ ఆర్టీసీ సంస్థ సికింద్రాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్సిల్ – కొరియర్స్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని సికింద్రాబాద్ రిజియన్ మేనేజర్ యుగేందర్ గురువారం తెలిపారు. సికింద్రాబాద్ రిజియన్ పరిధిలోని 12 డిపోలలో పార్సిల్ – కొరియర్స్ కౌంటర్లలో రాఖీలు, స్వీట్స్ ప్యాకెట్లు, ఇతర బహుమతులు పార్సిల్ చేయుటకు గాను టీఎస్ ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 250 గ్రాముల రాఖీలు రూ.30, 500 గ్రాములు రూ.40, 501 నుంచి 1000 వరకు రూ. 60 వరకు, ఇతర రాష్ర్టాలకు 250 గ్రాములు రూ.75, 500 గ్రాములు రూ. 100, 501 నుంచి 1000 వరకు రూ.125లు ఉంటాయని చెప్పారు. ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్లు 99592 26143, 97000 59322 లలో సంప్రదించాలన్నారు.