సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రయోజనాల కోసం నిధుల సమీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్కారు భూముల వేలం తెలంగాణ ‘రియల్’ బూమ్కు కొండంత బలంగా నిలుస్తున్నది. ఇటీవల కోకాపేట, ఖానామెట్లలో చేపట్టిన భూముల వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో దేశ రియల్ రంగం హైదరాబాద్ వైపునకు చూసేలా చేసింది. ఈ క్రమంలో తాజాగా మరో వేదికగా ప్రభుత్వం భూముల వేలానికి సిద్ధమవుతున్నది. పుప్పాలగూడలోని వందెకరాల కస్టోడియన్ (కాందిశీకుల) భూములను వేలం వేసేందుకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. రెవెన్యూ శాఖ అధికారులు ఆ భూముల్లోని చిన్న చిన్న ఆక్రమణలను తొలగించి… చదును చేశారు. త్వరలో టీఎస్ఐఐసీ ద్వారా ఈ భూముల వేలానికి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ గ్రామ సర్వే నంబర్ 301 నుంచి 303 నుంచి 325 నుంచి 328ల్లో దాదాపు 198 ఎకరాల వరకు కస్టోడియన్ భూములున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఈ భూములు తమవంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు తమకు ముంబైలో రిజిస్ట్రేషన్ చేసినట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూములపై తెలంగాణ సర్కారు కూడా సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేసింది. అన్నిరకాల ఆధారాలు చూపి, సమర్థ్ధవంతంగా వాదనలు వినిపించడంతో 2016లో సుప్రీం కోర్టు ఈ భూములు ప్రభుత్వానివేనని తేలుస్తూ తీర్పునిచ్చింది.
దీంతో వందల కోట్లాది రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. కాగా, ఈ భూములను ప్రస్తుతం టీఎస్ఐఐసీ ద్వారా వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ అధికారులు కొన్నిరోజులుగా అందులో చిన్న చిన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. సోమవారం పుప్పాలగూడలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, ఆర్డీవో కె.చంద్రకళ, తహసీల్దార్ రాజశేఖర్ పరిశీలించారు. రెవెన్యూ శాఖ నుంచి భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత వేలం నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్ఐఐసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.