భాగ్యనగరం గులాబీ శోభితమైంది.. ద్విదశాబ్ది సంబురం ఉరకలెత్తింది.. పార్టీ ప్రస్థాన మననం ఉత్తేజింపచేసింది.. భావిలక్ష్యం ఆలోచింపజేసింది. మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ అంగరంగ వైభవంగా జరిగింది. నగరవ్యాప్తంగా ఉదయం నుంచే కోలాహలం మొదలుకాగా, 11 గంటలకల్లా ప్రాంగణం కిక్కిరిసింది. ప్రతినిధుల క్రమశిక్షణ ఆసాంతం ఆదనపు ఆకర్షణగా నిలిచింది. గులాబీ వేదికగా ఏడేండ్లలో జరిగిన మహానగరాభివృద్ధి మరోసారి ప్రస్ఫుటమైంది. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై తీర్మానాల్లోనూ అగ్రస్థానం కల్పించారు.
ప్రధానంగా పచ్చదనం, పారిశుధ్యం, తాగునీరు, మురుగునీటి శుద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ఏ ఇతర నగరాల్లో లేనివిధంగా చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ హైదరాబాద్ దక్షిణ భారతంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. 20 ఏండ్ల గులాబీ పార్టీ ప్రస్థానాన్ని ‘టీఆర్ఎస్ కాన్సెప్ట్’ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో అమితంగా ఆకట్టుకుంది. సభకు వచ్చిన ప్రతినిధులంతా ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన చిత్రాలు, మంత్రి కేటీఆర్ బాల్యం ఫొటోలను తిలకించేందుకు క్యూ కట్టారు. హైదరాబాద్ ఇరానీ ఛాయ్కు ప్రతినిధులు ఫిదా కాగా, ప్లీనరీలో వంటకాలు అతిథులను మెప్పించాయి.
ప్లీనరీ విజయవంతం చేయ డంలో గ్రేటర్ నేతలు కీలకపాత్ర పోషించారు. ఆది నుంచి సమన్వయంతో వ్యవహరించడం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను ఎప్పటికప్పుడు ఆచరించి విజయవంతమయ్యారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే బాధ్యులంతా అహోరాత్రులు శ్రమించి సభకు ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి తమ సత్తా చాటుకున్నారు. వేదిక నిర్మాణం మొదలు సభా స్థలం, పార్కింగ్ వసతి, భోజన సదుపాయంలో పోటాపోటీగా శ్రమించి సఫలీకృతులయ్యారు.
వయస్సును లెక్క చేయకుండా సుదూర ప్రాంతం నుంచి ప్లీనరీకి తరలివచ్చి పార్టీపై తన ప్రేమను చాటుకున్నారు రాజన్న సిరిసిల్లకు చెందిన వయో వృద్ధుడు మిర్యాల ప్రభాకర్రావు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నానని, 20 ఏండ్లు పూర్తి చేసుకోవడం చారిత్రక ఘట్టమని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా ఉన్నాయని, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
చైతన్య దీప్తిని చేతబూని వెనకబాటు చీకట్లను పారదోలిన ఉద్యమ పతాక తెలంగాణ రాష్ట్ర సమితి తన ఇరవై ఏండ్ల పోరాట స్మృతులను నెమరువేసుకున్నది.
ఒక్కరితో యుద్ధం మొదలు పెట్టిన నాడు ఎదురైన అవహేళనలు, అవమానాల నుంచి తెలంగాణలోనే నేడు బలీయమైన ప్రజాశక్తిగా ఎదుగుతూ వచ్చిన ప్రస్థానాన్ని సమీక్షించుకున్నది. తెలంగాణ పురోగతియే ఆది అంతిమ ప్రాథమ్యంగా నిర్ణయించుకొని ఆ సంకల్ప ఆచరణకు అహరహం శ్రమిస్తున్న పయనంపై ప్లీనరీలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఉద్యమ రథ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తలపెట్టిన ఒక రోజు ప్లీనరీకి యావత్ తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా తరలివచ్చారు.
సభా వేదిక అంతా జై తెలంగాణ నినాదాల హోరుతో సాంస్కృతిక కార్యక్రమాల జోరుతో ధూంధాంల సందడితో మార్మోగింది. ఉద్యమ జ్ఞాపకాలు, స్వరాష్ట్రం సాధించిన విజయాలు, ప్రగతి నివేదికలతో చర్చలు, తీర్మానాలు, మేధోమథనాలు జరిగాయి. ఆయా జిల్లాల నాయకులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. క్షేమ సమాచారాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కాగా చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, ఎగ్ మసాలా, మటన్ దాల్చా, బోటి ఫ్రై, తలకాయ పులుసు, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారుతో వంటి మొత్తం 36 రకాల పసందైన రుచులతో ప్లీనరీ ఘుమఘుమలాడింది. ప్రవేశద్వారం సెల్ఫీ పాయింట్ గా మారింది. ఉద్యమ స్మృతులు, కేసీఆర్ జీవిత ఘట్టాలతో కలిపి 1500 ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు.