సిటీబ్యూరో, మే 18 ( నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్/జవహర్నగర్: ఆటో, లారీ, క్యాబ్ సేవలు నిలిచిపోనున్నాయి. 714 గెజిట్ నోటిఫికేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ ఆలస్య రుసుం రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నట్టు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ బంద్లో టీఆర్ఎస్కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, జీయూటీఎస్, టీఎస్టీడీజేఏసీ, తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ పాల్గొననున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ, కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతామని టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమలు మారయ్య, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలావుద్దిన్ తెలిపారు.బుధవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడారు. ఫిట్నెస్ సమయం ముగిసి పోయిన వాహనాలకు రూ. 50ల చొప్పున జరిమానా అంటే సంవత్సరానికి రూ.18 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇది ఆటో కార్మికులకు అదనపు భారంగా మారిందన్నారు. వెంటనే ఈ జరిమానాను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో తిరిగేందుకు కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని.. ఆటో, క్యాబ్ మీటర్ల రేట్లు పెంచాలని కోరారు.
నల్లచట్టాలతో కార్మికులకు అన్యాయం..
నల్ల చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నదని టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వేముల మారయ్య, చిన్నం బాల నర్సింహ అన్నారు. ఆటో యూనియన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న బంద్కు మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ రోడ్డు సెఫ్టీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట నిర్వహించే మహా ధర్నాకు కార్మికులు భారీగా తరలిరావాలన్నారు.