మన్సూరాబాద్, జనవరి 7: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న మూడు వేర్వేరు కేసుల్లో ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో పహాడీషరీఫ్, మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 950 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, 2 బైకులు, రూ. 2,990 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. బాలాపూర్ మండలం, జల్పల్లి గేట్, న్యూబాబా నగర్కు చెందిన మహ్మద్ రషీద్ఖాన్ (57) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. పాత నేరస్తుడు.
రాచకొండ, సైబర్బాద్, హైదరాబాద్ పోలీస్ కమిషరేట్ల పరిధిలోని 2016 నుంచి 2022 వరకు జరిగిన 30 కేసుల్లో నిందితుడు. పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చిన అతడిలో మార్పు రాలేదు. రాత్రి వేళల్లో ఇండ్లలో దొంగతనాలు చేసే వాడు. ఈ మధ్య కాలంలో గంజాయి అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించడాన్ని అలవర్చుకున్నాడు. దూల్పేట్కు చెందిన సంజయ్సింగ్ నుంచి తక్కువ ధరలో 10 గ్రాముల గంజాయి ప్యాకెట్లను సేకరించి అవసరమైన వారికి రూ.300 నుంచి రూ.500 అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడైన రషీద్ఖాన్ను జల్పల్లి గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 600 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. సంజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు.
బాలాపూర్ మండలం, సాదత్నగర్ షాహీన్నగర్కు చెందిన షేక్ జఫార్ (22) మొబైల్ టెక్నీషియన్. అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చునన్న ఆశతో గంజాయి వ్యాపారంలోకి దిగాడు. పహాడీషరీఫ్కు చెందిన అడ్డు భాయి అనే వ్యక్తి వద్ద తక్కువ ధరంలో గంజాయిని కొనుగోలు చేస్తూ అవసరమైన వారికి 10 గ్రాముల గంజాయి ప్యాకెట్లను రూ.300 నుంచి రూ.500 అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు షేక్ జఫార్ను పహాడీషరీఫ్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. అడ్డు బాయి పరారీలో ఉన్నాడు.
మీర్పేట్, సత్యం స్కూల్ సమీపంలోని నివసించే షేక్ ఫైజల్ (22) బైక్ మెకానిక్. మీర్పేట్కు చెందిన టామ్ అలియాస్ చింటూ వద్ద గంజాయిని కొనుగోలు చేసి అవసరమైన వారికి 10 గ్రాముల గంజాయి ప్యాకెట్లను రూ.300 నుంచి రూ.500 వందలకు అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడైన షేక్ ఫైజల్ను పహాడీషరీఫ్ ప్రశాంతిహిల్స్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 250 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. చింటు పరారీలో ఉన్నాడు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి పాల్గొన్నారు.