సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): గర్భంలోని శిశువును తల్లి అత్యంత జాగ్రత్తగా రక్షించుకుంటూ.. ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ మురిసిపోతుంది. అటువంటి ప్రేమను పంచే తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు కొందరు ప్రబుద్ధులు. పిల్లలపై లైంగికదాడులు, కిడ్నాప్లు, భిక్షాటనలో భాగం చేయడం తదితర అంశాలపై ప్రతి ఒక్కరూ స్పందించి చిన్నారులను కాపాడుకోవాలని నగర మహిళా ఆర్టిస్టులు నినదించారు. చిన్నారులతో తల్లికి ఉండే పేగుబంధాన్ని ఆవిష్కరించారు. పిల్లల రక్షణ థీమ్పై ఆలోచన రేకెత్తించే పెయింటింగ్స్తో ఆకట్టుకున్నారు.
మరో మహిళా ఆర్టిస్టు భారతీ కేర్.. శిశువుకు తల్లి పాలు పడుతున్న చిత్రాన్ని గీసి పేగుబంధాన్ని ఆవిష్కరించింది. ప్రకృతి ఒడిలో తాను నిల్చొని తన చేతులను ఒడిగా మార్చి ఆ శిశువుకు పాలిస్తున్నట్టుగా ఉన్న ఆ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మ రూపొందించిన చేతుల ఒడిలో రాజులా బజ్జొని పాలు తాగుతున్న ఆ శిశువు తన తల్లి గుండెలపై చేయి వేస్తున్నట్టుగా ఉన్న ఈ చిత్రం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచి మనం పిల్లలను ఎంత మురిపంగా చూసుకున్నామో..అట్లాంటి పిల్లలకు ఆపద రాకుండా చూసుకోవాలని ఈ చిత్రం చెబుతున్నట్టు భారతి తెలిపింది. మరో చిత్రంలో బాలిక తన తల్లిని మనసారా హత్తుకుంటుంటే తల్లి ఆ బిడ్డను ముద్దాడుతుంటుంది. ఈ చిత్రంలో పిల్లలు పెరుగుతున్నప్పటికీ తల్లి ప్రేమలో మార్పు ఉండదని.. అంతే ప్రేమ కొనసాగుతుందని భారతి చాటి చెప్పింది.
తన కడుపులో ఉన్న బిడ్డ కోసం తల్లి ఎంతలా ఎదురుచూస్తుందో తెలిపే చిత్రాన్ని ప్రముఖ ఆర్టిస్టు ఉషా నాగలక్ష్మి గీశారు. గర్భంలో ఉన్న శిశువుకు ఆ చల్లని చంద్రుడు, సెలయేళ్ల శబ్ధాలను వినిపిస్తూ ఆ తల్లి మురిసిపోతుంది. అంతేకాదు తన గర్భంలో ఉన్న శిశువును ఆకాశంలో కనిపిస్తున్నట్టుగా తల్లి ఆ బిడ్డను తదేకంగా గమనిస్తున్న ఈ చిత్రం ప్రతీ మనసును కదిలించేలా ఉంది. మొక్కల కొమ్మలతో చిన్నారిని గీసిన ఉషా ఆలోచన అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో చిత్రంలో గర్భంలో శిశువు ఎంత రక్షణగా ఉంటాడో ఆవిష్కరించింది. బయటి ప్రపంచంలోకి వచ్చాక వారికి అందరూ అంతే రక్షణగా నిలబడాలనే సంకేతాన్ని చాటింది.
పిల్లల నవ్వులు చూస్తే ఏ తల్లి మనసైన ఉప్పొంగక మానదు. గర్భంలో నుంచే ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ప్రాణంగా ప్రేమను పంచే తల్లికి ఆ పిల్లలు దూరమైతే అది చాలా కష్టమైంది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరితీయాలి. దేశవ్యాప్తంగా చిన్నారుల రక్షణకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
– భారతీ కేర్, ప్రముఖ ఆర్టిస్టు
చిన్నారులు స్వచ్ఛమైన మనసు కలవారు. చిన్న గద్దింపునకే భయపడిపోతారు. అట్లాంటి పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు కొట్టడం, తిట్టడం, కొందరు టీచర్లు కూడా పిల్లలపై అరవడంలాంటివి చేస్తుంటారు. అటువంటివి మానుకోవాలని.. చిన్నారులు తల్లిదండ్రుల ప్రతిబింబాలని గుర్తు చేస్తూ మహిళా ఆర్టిస్టు తేజస్వి పూజారి గీసిన చిత్రం ఆలోచన రేకెత్తించేలా ఉంది. తెల్లని చామంతి పూలకు ఒక చిన్నారి తనకిష్టమైన రంగులను అద్దుతూ ఎంతలా మురిసిపోతుందో తన ఆర్ట్తో కళ్లకు కట్టింది.
ఈ సృష్టిలో అమ్మ ప్రేమను నిర్వచించలేం. తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో అనుభూతి చెంది గీసిన చిత్రం. ప్రాణంగా పెంచుకున్న పిల్లలు దూరమైతే పడే బాధ చాలా పెద్దది. పిల్లలపై జరుగుతున్న హింస రూపుమాపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
-ఉషా నాగలక్ష్మి, ప్రముఖ ఆర్టిస్టు
అధిక బరువు బాధితుల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో సంభవించే ప్రతి 3 మరణాల్లో రెండు ఇవే ఉంటున్నాయని తేలింది. ఇందులో 25-38ఏండ్ల లోపు ఊబకాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించి శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉంటున్నట్లుగా తేలింది. కనీసం రోజులో 20-30 నిమిషాల పాటు శారీరక శ్రమతోపాటు ఆహారంలో పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు, సీజనల్ పండ్లను ఆహారం భాగంగా చేర్చుకోవాలని సూచిస్తోంది. దీంతో బరువు అదుపులో ఉండేందుకు దోహదపడుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.
చిన్న పిల్లలపై దేశవ్యాప్తంగా హింస జరుగుతున్నట్టుగా కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. ఆడ శిశువు అని తెలుసుకుని వదిలేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మనసును మెలిపెడుతాయి. పిల్లలు మన ప్రతిబింబాలు. వారిని అత్యంత జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
-తేజస్వి పూజారి, ప్రముఖ ఆర్టిస్టు