రవీంద్రభారతి, అక్టోబర్ 19: నూతన పదకల్పంతో దిశాంతర స్వప్నం పుస్తకాన్ని రాసిన శేషభట్టర్ రఘు నూతన ఒరవడి సృష్టించారని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలోని మినీ కాన్ఫరెన్స్లో శేషభట్టర్ రచించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వక్తలుగా వఝుల శివకుమార్, అమ్మంగి వేణుగోపాల్, శిఖామణి, ఎలనాగ, వెలుదండ నిత్యానందరావు పాల్గొని ప్రసంగించారు. కవిత్వ సూర్యుడిగా శేషభట్టర్ రఘు కొనసాగుతున్నారని అన్నారు. కవిసేన కావ్యశాస్ర్తాన్ని రచించిన గుంటూరు శేషేంద్రశర్మ గొప్ప పేరు తెచ్చుకోగా.. దిశాంతర స్వప్నం రాసిన శేషభట్టర్ రఘు శేషేంద్రశర్మ వారసుడుగా మారారని కొనియాడారు. అనంతరం దిశాంతర స్వప్నం పుస్తక రచయిత రఘు మాట్లాడుతూ ఒకేసారి రెండు పుస్తకాలు ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వక్తలు శేషభట్టర్ రఘును ఘనంగా సన్మానించారు.