సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంతో పాటు నేరాలను ఛేదించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ‘లా ఎన్ఫోర్స్మెంట్ సిసో కౌన్సిల్’ను ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు ఇప్పుడు పోలీసులకు ఒక సవాల్గా మారుతున్నాయని తెలిపారు. 2023 చివరి నాటికి దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని, ఇది 2022 యూఎస్ఏ జీడీపీలో మూడవ వంతని, ఈ సంవత్సరం దేశంలోని జీడీపీలో 2వ వంతని తెలిపారు. ఇంతటి క్లిష్టమైన సైబర్ నేరాలను వివిధ సంస్థలకు చెందిన నిపుణుల సహకారంతో తెలంగాణ పోలీసులు ఛేదించగలుగుతున్నట్లు పేర్కొన్నారు.
వారిద్దరూ మెయిన్ పిల్లర్లు
సైబర్ నేరాలను ఛేదించడమే కాకుండా బాధితులు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి రికవరీ చేయడంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బ్రైటింగ్ స్టార్స్ అని తెలిపారు. స్టీఫెన్ రవీంద్ర సైబర్ నేరాలను ఛేదించి, నేరగాళ్ల ఖాతాల్లో నుంచి డబ్బులు రికవరీ చేసి, బాధితులకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుండగా, జయేశ్రంజన్ తన ఐటీ రంగంలో అప్గ్రేడ్ అవడమే కాకుండా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖలో నేరాలను ఛేదించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఎంతటి నిపుణులైనా..
ఆయా రంగాల్లో పనిచేసే నిపుణులు వారు పనిచేస్తున్న రంగాలను చాలా తేలికగా తీసుకుంటారని, కానీ అది ప్రమాదకరమని డీజీపీ అన్నారు. కొన్ని రోజుల కిందట తన తోటి అధికారి సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.5లక్షలు పోగొట్టుకొని, సహాయం చేయమని తన వద్దకు వచ్చారని తెలిపారు.
ఆ దేశంలో 20వేల బాలింతలు మృతి
ఒక దేశంలో 20వేల మంది బాలింతలు ప్రసవించిన కొన్ని గంటల్లోనే మృత్యువాత పడ్డారని, ఇలా 20 సంవత్సరాల పాటు ఈ దుర్ఘటనలు కొనసాగాయని డీజీపీ చెప్పారు. తీరా 20ఏళ్ల తరువాత దీనిపై క్షుణ్ణంగా విచారిస్తే ప్రసవాలు జరిపిన వైద్యులు రాత్రి సమయాల్లో పోస్టుమార్టం చేయడం, అవే వైద్యపరికరాలతో పగలు సమయంలో ప్రసవాలు చేస్తున్నట్లు తేలిందని, పోస్టుమార్టం చేసిన వైద్య పరికరాల వల్ల ప్రసవాలు చేయడంతో బాలింతలు ఇన్ఫెక్షన్కు గురై, 20వేల మంది తల్లులు మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. అందుకే ఎంత నిపుణులైనా అప్రమత్తంగా ఉండాల్సిందేనని తెలిపారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడితే 1930కు ఫిర్యాదు చేయాలి
లా ఎన్ఫోర్స్మెట్ సిసో కౌన్సిల్కు సంబంధించిన లోగో యూరోపియన్ ఫుడ్బాల్ కప్లా ఉంది. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన లా ఎన్ఫోర్స్మెంట్ సిసో కౌన్సిల్ అనేది తెలంగాణలో సైబర్ సెక్యూరిటీకి ‘బీకాన్’. ప్రస్తుత రోజుల్లో ప్రతీది డిజిటలైజేషన్ అవుతుంది. డిజిటల్ వినియోగదారులు పెరిగినప్పుడు సైబర్ నేరాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడినప్పుడు వెంటనే 1930 లేదా ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాలను అరికట్టడంలో లా ఎన్ఫోర్స్మెంట్ సిసో కౌన్సిల్ ఎంతగానో ఉపయోగపడనున్నది.సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.
– జయేశ్రంజన్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.
సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి : సీపీ స్టీఫెన్ రవీంద్ర
గడిచిన ఏడాది కాలంలో సైబర్ నేరాలు 300శాతం పెరిగాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మన డిజిటల్ స్పేస్, ప్రభుత్వ సంస్థలు, కీలకమైన పరికరాలు, పరిశ్రమలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్నాయక్, క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, అన్ని జోన్ల డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, రమేశ్ కాజా తదితరులు పాల్గొన్నారు.