వ్యవసాయ యూనివర్సిటీ , సెప్టెంబర్ 21 : ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆల్ ఇండియా ఆర్గానిక్ ఇండస్ట్రీస్ (ఏఐవోఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సును మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి సంతోష్ సారంగి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో నిపుణుల కొరత ఉందని, ఈ కోర్సు ద్వారా ఆ లోటు తీరుతుందని భావిస్తున్నానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమ నిర్వహణకు చొరవ తీసుకున్నందుకు ఉపకులపతి ప్రవీణ్రావును ఆయన అభినందించారు. ఏఐవోఐ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి డా.గౌరి, రాష్ట్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఆన్లైన్లో పాల్గొన్నారు. ఉపకులపతి ప్రవీణ్రావు కీలకోపన్యాసం చేశారు. సేంద్రియ వ్యవసాయంలో కలుపు నివారణ ప్రధాన సవాలు అని, దీని నియంత్రణకు సంబంధించిన అంశాలను కోర్సులో పొందుపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, డా. జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.