Temples | చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో దాతలు ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలపై సరైన జవాబుదారీతనం లేకపోవడంపై దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జరిపిన తనిఖీల్లో స్వామివారికి ఓ భక్తుడు సమర్పించిన 2.3 కిలోల వెండి కిరీటానికి సంబంధించి రసీదు ఇవ్వలేదని గుర్తించారు. ఆ కిరీటాన్ని మార్పు చేసేందుకు కంసాలికి ఇచ్చి 4ఏండ్లు గడిచినా తిరిగి తీసుకురాకపోవడం, ఆ సమయంలో ప్రస్తుత ఈవో రామాంజనేయులు ఇదే ఆలయంలో పనిచేస్తున్నట్టు గుర్తించిన కమిషనర్ ఆయనను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వినోద్రెడ్డిని విచారణాధికారిగా నియమించి నివేదిక ఇవ్వాలని కోరారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఓ భక్తురాలు ఇచ్చిన రూ.16లక్షల విలువైన బంగారు ఆభరణం కనిపించడం లేదని అర్చకుడిపై ఫిర్యాదు చేశారు. అమ్మవారికి ఉన్న ఆభరణం వంటిదే మరొకటి చేయించాలని కోరిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆభరణమే చూపించడం, డబ్బులు సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆభరణానికి సంబంధించి రసీదు ఇవ్వకపోవడంపై సదరు భక్తురాలు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
మడికొండలోని ఓ ప్రముఖ శివాలయంలో శివలింగానికి సంబంధించి పానవట్టానికి సుమారు 25కిలోల వెండి సేకరించారు. అందులో కొంత వినియోగించి మిగతాది తమ సొంతానికి వాడుకున్నారంటూ గతంలో పనిచేసిన ఈవో, అర్చకుడిపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో దేవాదాయశాఖకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తితో రాయబారం నడిపి ఉన్నతాధికారులతో చర్యలు లేకుండా మేనేజ్ చేసుకున్నారని భక్తులు చెప్పుకొంటున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని దేవాలయాల్లో దేవుడి సొత్తు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. దేవతల ఆభరణాల లెక్కలు, భద్రపరిచే విషయంలో కొందరు ఈవోలు, అర్చకులపై ఆరోపణలు వెల్లువెత్తడమే ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది. కానుకల రూపంలో తాము సమర్పించిన సొత్తు దేవునికే దక్కిందా? లేక లాకర్లో ఉన్నట్టు చూపి ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా అని భక్తుల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల నుంచి వస్తున్న బంగారు, వెండి ఆభరణాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉద్యోగులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిరుడు వరంగల్ భద్రకాళీ ఆలయంలో అమ్మవారికి ఓ భక్తుడు 13 గ్రాముల బంగారు గొలుసు చేయించి ఇచ్చాడు. నిబంధనల ప్రకారం గొలుసును తూకం వేసి, దేవస్థానంలోని ఆభరణాల పుస్తకంలో నమోదు చేసి సదరు దాతకు రసీదు ఇవ్వాలి.
కానీ ఆలయంలో భద్రంగా ఉండాల్సిన బంగారం, ఓ ప్రైవేట్ వ్యక్తి తన ఇంట్లో పెట్టుకున్నట్టు తెలియడంతో ఆలయ ఈవో స్వాధీనం చేసుకున్నారు. గతంలో సికింద్రాబాద్ గణపతి ఆలయంలో భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలకు రసీదు ఇవ్వలేదు. ఉజ్జయినీ మహంకాళీ సహా ఇతర ఆలయాల్లోనూ ఈవోలపై కేసులు నమోదయ్యాయి. ఇలా చాలాచోట్ల జరిగిన సందర్భాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో అర్చకులు భక్తుల నుంచి అనధికారికంగా నగదు తీసుకోవడం, దేవుడికి నగలు, ఇతర వస్తువుల పేరుతో వసూలు చేసిన సొమ్ము స్వాహా చేస్తున్నారని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో వెలుగుచూసింది. ముఖ్యంగా వారాంతంలో రద్దీగా ఉండే ఆలయాల్లో ఈవోలు, అర్చకులు ఒక్కటై ఆభరణాలకు రసీదు ఇవ్వడం లేదని కూడా గుర్తించారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్న బంగారం, వెండి విలువ రూ.వందల కోట్లుగా పెరుగుతున్నది. బ్యాంకుల్లోనూ బాండ్ల రూపంలో దాచిన బంగారంతో ఆలయాలకు ఆదాయం కూడా వస్తున్నది. బంగారానికి వెండి తోడై.. దేవస్థానాలకు ఆర్థిక పరిపుష్టినిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కలిపి 560 కిలోల బంగారం, సుమారు 30వేల కిలోల వెండి ఉన్నట్టు దేవాదాయశాఖ గుర్తించింది. వీటి విలువ రూ.2వేల కోట్లపై మాటేనని అధికారులు చెబుతున్నారు. కిరీటాలు, ఉంగరాలు, కంఠాభరణాల వంటివి కొందరు సమర్పిస్తుంటే మరికొందరు భక్తులు బంగారు బిస్కెట్లు, నాణేలు, ముక్కలను హుండీలో వేస్తున్నారు. మరికొందరు వారసత్వంగా వచ్చిన ఆభరణాలను దేవుడికి అర్పిస్తున్నారు. బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుండటంతో ఆలయాల సంపద విలువ కూడా వృద్ధి చెందుతున్నది.
దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల నమోదు తప్పనిసరి. ఆలయం పేరుతో రసీదు పుస్తకాలు ముద్రించి ప్రతి కానుకకూ రసీదు ఇవ్వాలి. ధర్మకాంట ఆధారంగా తూకం లెక్కలు రాసి ఇవ్వాలి. వెంటనే వివరాలు ఇన్వెంటర్ రిజిస్టర్లో నమోదు చేయాలి. పది గ్రాములు దాటిన బంగారం, వెండి ఆభరణం, ఇతర వస్తువులకు రసీదులు ఇవ్వాలి. చిన్న చిన్న వస్తువులైతే హుండీలో వేయాలి. అన్ని ఆలయాల్లో ప్రతి ఆరు నెలలకోసారి దేవాదాయశాఖ పక్షాన ఆభరణాల తనిఖీ అధికారి తనిఖీ చేసి ఇన్వెంటరీ బుక్ను పరిశీలించాలి. దేవుళ్ల అలంకరణ కోసం పూజారులకు భక్తులు ఇచ్చే వస్తువుల వివరాలు ఆలయ అధికారిక పుస్తకంలో నమోదు చేయాలి.