సిటీబ్యూరో/అబిడ్స్, జూలై 5(నమస్తే తెలంగాణ): పేకాట స్థావరంపై దాడి చేసి రికవరీలో అవకతవకలు చేశారనే ఆరోపణలపై మంగళ్హాట్ పోలీస్స్టేషన్కు చెందిన ఓ ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది నవంబర్లో మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడి చేసి 14 మందిని ఎస్సై వెంకటేశ్వర్లు నేతృత్వంలో కానిస్టేబుళ్లు మురళి, ఇమాన్లు, రవికిరణ్, జానకిరామ్ బృందం అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో పట్టుబడిన పేకాటరాయుళ్ల వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బు రికవరీ చేసి, అధికారికంగా తక్కువగా చూపించారని సీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లను సీపీ సస్పెండ్ చేశారు. ఇదిలాఉండగా అరెస్టు అయిన వారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉండటం, పట్టుబడిన సమయంలో అతన్ని మంగళ్హాట్ పోలీసులు వదిలిపెట్టకపోవడంతో రికవరీలో అవకతవకలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేశారని, రూ.4.12 లక్షలు రికవరీ చేసి, వాటిని కోర్టులో సమర్పించామని, ఈ కేసులో చార్జిషీట్ కూడా వేశామంటూ మంగళ్హట్కు చెందిన ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.