స్వయం ఉపాధి కోసం వీధి వ్యాపారం నిర్వహిస్తున్న వారికి ఆర్థిక ఊరట. అధిక వడ్డీలు తీసుకొచ్చే బాధ లేకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో బల్దియా స్వల్ప వడ్డీకే రూ.10 వేలు రుణ సాయం అందజేస్తున్నది. గ్రేటర్వ్యాప్తంగా 79,292 మంది వీధివ్యాపారులను గుర్తించి 20,837 మందికి రూ.10 వేల చొప్పున ఇప్పటికే అందజేశారు. మిగిలిన వారందరికీ శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ‘స్వనిధి సే సమృద్ధి’ పేరుతో ప్రాంతాల వారీగా విభజించి ఆయా బ్యాంకులు రుణ సాయాన్ని అందజేయనున్నాయి. ప్రధానంగా పండ్లు, పూలు, చేపలు, ఆహార పదార్థాలు విక్రయించే వారికి మేలు జరగనుంది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరం ఎన్నో రకాల వ్యాపారాలకు అనువైన కేంద్రం. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎన్ని వచ్చినా చిరు వ్యాపారాలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించి, వారికి రూ.10వేల ఆర్థిక సాయంతో ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిరు వ్యాపారులకు సరైన సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ఒకవైపు హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేస్తూనే మరో వైపు చిరు వ్యాపారులకు రూ.10వేల రుణ సాయం అందిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 79,292 మంది చిరు వ్యాపారులను గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 20,837 మందికి రూ.10వేలు చొప్పున రుణాలు అందజేశారు. మిగిలిన 58,455మందికి రుణాలు అందించే క్రమంలో నేటి నుంచి ‘స్వనిధి సే సమృద్ధి’ పేరుతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు ఆయా బ్యాంకర్లతో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రుణాలు ఇవ్వనున్నారు.
వీధి వ్యాపారులకు ఎటువంటి నష్టం జరగకుండా వారికి రక్షణ కల్పిస్తున్నారు. వీధి వ్యాపారుల చట్టాన్ని జీహెచ్ఎంసీ పకడ్బందీగా అమలు చేస్తున్నది. ముందుగా వ్యాపారాలు కొనసాగించే జోన్లను గుర్తించి స్వేచ్ఛగా విక్రయాలు సాగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గతంలో చాలా మంది వ్యాపారులు ఏ రోజుకారోజు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని భారీగా వడ్డీలు చెల్లించేవారు. దీనిని నివారించేందుకు వారికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రూ.10వేల రుణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. వీధి వ్యాపారాన్ని చట్టబద్ధం చేస్తూ వారికి ప్రయోజనాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వాలు వీధి వ్యాపారుల చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నాయి.
నిరంతరం వ్యాపారాలు చేసుకునే జోన్లు (గ్రీన్ జోన్గా), పాక్షికంగా ఎంపిక చేసిన సమయాల్లో మాత్రమే వ్యాపారాలు చేసే జోన్లు (యాంబర్ జోన్), వ్యాపారాలు నిషేధించిన జోన్లు (రెడ్ జోన్)గా ఎంపిక చేస్తున్నారు. స్ట్రీట్ వెండర్స్గా గుర్తించిన వారికి గుర్తింపు కార్డులను అందిస్తున్నారు. తోపుడు బండ్ల నిర్వాహకులు, ఎలక్ట్రిషియన్లు, రోడ్ల వెంబడి దుకాణాలు, చేపలు, పండ్ల వ్యాపారులు, టైలరింగ్, తదితర వ్యాపారులను అర్హులుగా గుర్తించి, వారికి రూ.10వేల రుణం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాపారుల్లో ఎక్కువ శాతం చదువుకోని వారు ఉండటంతో వారి వ్యాపారాభివృద్ధికి జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగం అధికారులు అవసరమైన శిక్షణను ఇస్తున్నారు. నేటి నుంచి స్వనిధి సే సమృద్ధి క్యాంపుల ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు ఇప్పటికే జీహెచ్ఎంసీ లబ్ధిదారులకు సమాచారం అందించింది.