స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ).. ఈ పథకం అమల్లోకి వచ్చాక నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలా చోట్ల సాఫీ ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం రూ. 5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులను చేపట్టి..34 పూర్తి చేసింది. ఇందులో 18 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్పాస్లు, ఏడు ఆర్వోబీ ఆర్యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో మూడు ఇతర పనులు ఉన్నాయి. ఇక మిగిలిన పద్నాలుగు పనుల్లో మూడు ఇతర శాఖలవి మినహాయిస్తే.. 11 ప్రాజెక్టుల్లో ఒకటి తప్ప.. ఈ ఏడాది పదింటిని అందుబాటులోకి తీసుకురావాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు పనుల పూర్తికి లక్ష్యాలను ఖరారు చేస్తూ.. కమిషనర్ లోకేశ్కుమార్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్తో మొదలైన ఎస్ఆర్డీపీ ఫలితం.. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా జూపార్క్ ఫ్లై ఓవర్తో తొలి విడత దాదాపుగా పూర్తి కానున్నది.
సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాహనదారులు గమ్యస్థానానికి సకాలంలో చేరేలా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్) పథకాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ను నియంత్రించి వేగం పెంచడంతోపాటు కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇప్పటి వరకు 34 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 18 ఫ్లైఓవర్లు, ఐదు అండర్పాస్లు, ఏడు ఆర్వోబీ/ఆర్యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో మూడు ఇతర పనులను పూర్తి చేశారు. ఇక మిగిలిన 14 ప్రాజెక్టుల్లో ఇతర శాఖలకు సంబంధించి మూడు పనులు మినహా, జీహెచ్ఎంసీ సంబంధించి 14 ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. పురోగతిలో ఉన్న 11 ప్రాజెక్టుల్లో ఒకటి మినహా ఈ ఏడాదిలో 10 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు పనుల పూర్తికి లక్ష్యాలను ఖరారు చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ మినహా ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఎస్ఆర్డీపీ తొలి విడత పథకం దాదాపుగా పూర్తి కానున్నది.
ఎస్ఆర్డీపీ పథకంతోపాటు అర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో మరో మూడు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నది. అంబర్పేట ఛే నంబర్ ఫ్లైఓవర్ను రూ.270కోట్లతో, ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్లతో రూ.283.15 కోట్లతో ఫ్లైఓవర్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఉప్పల్ నుంచి సీపీఆర్ఐ వరకు ఆరు లేన్లతో రూ.626.76 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు.