సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: నిత్యజీవితంలో ఆచరణే వేదాంత పరమలక్ష్యమని హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద అన్నారు. రామకృష్ణ మిషన్ 125వ వార్షిక వేడుకల్లో భాగంగా రామకృష్ణమఠంలో ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యక్రమం శనివారం నిర్వహించారు. వివేకానంద ఆరోగ్య కేంద్రం 44 ఏండ్లుగా పేదలకు వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ రవీంద్ర, డాక్టర్ స్మితా కోల్హే, నేషనల్ మెడికల్ మిషన్ సభ్యుడు డాక్టర్ సంతోష్ క్రాలేటి, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్రావు, బేలూర్ మఠం స్వామి సత్యేశానంద, ఈటానగర్, ముంబై రామకృష్ణ మిషన్కు చెందిన స్వామి కృపాకరానంద, దయాధిపానంద, వైద్యులు, వలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు.