సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకొని జాతి గొప్పతనాన్ని నిలుపుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ వేడుకలను నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీనటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి ప్రారంభించారు.
ప్రముఖ రచయిత కొలకలూరి ఇనాక్ సభాధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆటాకు అమితమైన ప్రేమ ఉన్నదని ఈ కార్యక్రమం ద్వారా తెలిసిందన్నారు. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో అమెరికా భారతి పేరుతో మాసపత్రిక ఆన్లైన్ ద్వారా నిర్వహించడం తెలుగు పై వారికున్న మమకారానికి నిదర్శనమన్నారు. అలాగే అమెరికాలో తెలుగు చదువుకోవడానికి యువతకు అన్ని విధాల సహకరిస్తున్న ఘనత వారిదేనని తెలిపారు.
తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేసి వెలికితీసే ప్రక్రియను ఆటా చేయడం గొప్పగా ఉన్నదన్నారు. ‘ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియా రంగం’ అనే అంశంపై ప్రముఖ రచయిత కాసుల ప్రతాప్రెడ్డి అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించగా ‘టీవీ ప్రసారాలు అప్పుడు-ఇప్పుడు’ అనే అంశంపై శాంతి స్వరూప్, ‘శ్రోతల జీవితాన్ని నిర్దేశించిన రేడియో’ అంశంపై అయినంపుడి శ్రీలక్ష్మి, ‘నూతన మాధ్యమాలు సత్యాసత్యాలు’ అంశంపై ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ‘ఇవాలటి తెలుగు పరిశోధకులకు మార్గదర్శనం’ అంశంపై సంగిశెట్టి శ్రీనివాస్, ‘సాంకేతిక యుగంలో సాహిత్య పాత్ర’ అంశంపై స్వామి తమ భావనలను వివరించారు.
‘అనువాదం, నాటకం అవధానం’ అనే అంశంపై రూప్ కుమార్ డబ్బికార్ అధ్యక్షతన రెండో సమావేశం నిర్వహించగా, ‘అనువాదంలో చిక్కులు సమస్యలు’ అంశంపై జేఎల్ రెడ్డి, ‘అనువాద సాహిత్యం-ఆవశ్యకత’ అంశంపై నలిమెల భాస్కర్, ‘తెలుగు నాటకం తీరూ తెన్నులు’ అంశంపై దెంచనాల శ్రీనివాస్, ‘పరిశోధన, విమర్శ, సమాలోచనలు’ అంశంపై కొలకలూరి మధుజ్యోతి, ‘అవధానంలో చమత్కారం’ అంశంపై నరాల రాంరెడ్డి వారి ఆలోచనలను పంచుకున్నారు.
‘తెలుగు కథలు, నవల, విశ్లేషణ’ అనే అంశంపై వెల్దండి శ్రీధర్ అధ్యక్షతన 3వ సమావేశం నిర్వహించారు. ‘జీవన స్రవంతి నవల-అనుభవాలు’ అనే అంశంపై టేకులపల్లి గోపాల్రెడ్డి, ‘నవల సాహిత్యంలో కొత్త పోకడలు’ అంశంపై మధురంతకం నరేంద్ర, ‘యువతపై నవల సాహిత్య ప్రభావం’ అంశంపై మధుబాబు, ‘తరాల తెలుగు కథ’ అంశంపై పెద్దింటి అశోక్ కుమార్, ‘తెలుగు సాహిత్యంలో నవల ప్రాధాన్యత’ అంశంపై సన్నపురెడ్డి వెంకట్రామారెడ్డి, ‘కథల్లో కొత్తదనం’ అనే అంశంపై మహ్మద్ గౌస్, ‘కథ-సమాజం’ అంశంపై హుమాయూన్ సంఘీర్ తమ భావనలను వివరించారు.
‘ఆధునిక కవితా పరిణామాలు’ అనే అంశంపై కవి యాకూబ్ అధ్యక్షతన 4వ సమావేశం నిర్వహించారు. ఎస్వీ సత్యనారాయణ, మువ్వా శ్రీనివాస్రావు, నాలేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, మందారపు హైమావతి, కొండపల్లి నిహారిణి, కందుకూరి శ్రీరాములు, పద్య కవితా శిల్ప సౌందర్యం అంశంపై జిల్లేపల్లి బ్రహ్మం తమ భావాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. గేయ సాహిత్యం అనే అంశంపై రవీందర్ పసునూరి అధ్యక్షతన 5వ సమావేశం నిర్వహించారు. ప్రముఖ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, పెంచలదాసు, కాసర్ల శ్యామ్ పాటలతో ఉర్రూతలూగించారు.
‘సినిమా సాహిత్య మేళవింపు’ అనే అంశంపై సినీ నటుడు తనికెళ్ల భరణి అధ్యక్షతన 6వ సమావేశం నిర్వహించగా జనాభా దృశ్య కళా రూపాలు-ప్రదర్శన పద్ధతులు అనే అంశంపై తప్పెట రాంప్రసాద్రెడ్డి, సినిమాల్లో జానపద కళారూపాలు అంశంపై బలగం వేణు, దృశ్య మాధ్యమంలో చారిత్రక అంశాలపై అల్లాని శ్రీధర్, దృశ్య మాధ్యమంలో తెలుగు కవిత్వం అంశంపై మహ్మద్ షరీఫ్ తమ భావనలను వ్యక్తపరిచారు.
ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటా చేస్తున్న సాహిత్య సేవ మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ కిషన్రావు, ఆటా వేడుకల కోచైర్మన్ వేణు సంకినేని, ఆటా సెక్రటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీశ్రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ సాయిసుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ , లిటరేచర్ చైర్మన్ వేణుగోపాల్, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి, కాశీ, ఆటా ఇండియా కోఆర్డినేటర్ అమృత్, సూర్యచంద్రా రెడ్డి, జ్యోత్స్నారెడ్డి, సాహితీ ప్రియులు, అభిమానులు పాల్గొన్నారు.