ఖైరతాబాద్, నవంబర్ 15 : తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ సౌర రైతుల సాధికార సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సలహాదారుడు సంతోష్ రావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సమ్మేళనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు కలిగిన రైతులకు దోహపడుతుందన్నారు. ఒక మెగావాట్ ఉత్పత్తి కావాలంటే సుమారు మూడున్నర నుంచి నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంటుందని, ఒక రైతు కాని, ఫార్మర్ సొసైటీకి హాఫ్ మెగావాట్ నుంచి 2 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేసుకునే వీలు కల్పిస్తున్నామని తెలిపారు. నాబార్డు నుంచి రైతుకు వడ్డీ రాయితీ కూడా ఉంటుందని, ఒక మెగా వాట్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే రూ.4కోట్ల వ్యయమవుతుందని, కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే చెల్లిస్తే మిగతా మొత్తం రుణం
లభిస్తుందన్నారు.
యూనిట్కు రూ.3.13 ధరను డిస్కమ్ చెల్లిస్తుంది..
25 ఏండ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో యూనిట్కు రూ.3.13 ధరను డిస్కమ్ నుంచి చెల్లిస్తుందని, ఈ పథకంలో చేరేందుకు రాష్ట్రంలోని వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, 883 మంది రైతులు అర్హత సాధించారన్నారు. వారికి డిస్కమ్తో ఒప్పందం కుదిరిందన్నారు. 16, 17న జరిగే సమ్మేళనంంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పరికరాలను ప్రదర్శిస్తున్నామని, దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన ఉత్పత్తిదారులు వస్తున్నారని తెలిపారు.
సోలార్ ప్లాంట్ పెట్టాలంటే భూమి సర్వే, లీగల్ డాక్యుమెంటేషన్, వాల్యూయేషన్, సాయిల్ శాంపిల్ తదితర ప్రక్రియలుంటాయని, వాటిపై టీఎస్రెడ్కో, డిస్కమ్ నిపుణులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.రమేశ్, కార్యవర్గ సభ్యుడు రాజ్ కృష్ణతో కలిసి
ఆవిష్కరించారు.