సిటీబ్యూరో/షాద్నగర్/శంషాబాద్ రూరల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సిర్పూర్కర్ కమిషన్ పరిశీలించింది. ఇందులో దిశ ఎన్కౌంటర్ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ చైర్మన్ సిర్పూర్కర్, సభ్యులు రేఖ, కార్తికేయ, కమిషన్ కార్యదర్శి శశిధర్రెడ్డితో దిశ ఎన్కౌంటర్ సిట్ దర్యాప్తు అధికారి, రాచకొండ సీపీ మహేశ్భగవత్, ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారి రాచకొండ ఎస్ఓపీటీ డీసీపీ సురేందర్రెడ్డి ఉన్నారు. స్థానిక శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో షాద్నగర్ ఏసీపీ కుషల్కర్ తదితర అధికారులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన సిర్పూర్కర్ కమిషన్ బృందం ముందుగా దిశ నిందితులు ఉపయోగించిన శంకర్పల్లి ప్రాంతంలోని సేఫ్హౌస్ను సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి 11.30 గంటల ప్రాంతంలో చటాన్పల్లిలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. క్షేత్ర స్థాయిలో కమిషన్ సభ్యులు, సిట్ అధికారి పంట పొలాల్లో పర్యటించారు.
నిందితుల ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాన్ని దర్యాప్తు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కమిషన్ పరిశీలన జరిపింది. దిశ మృతదేహాన్ని కాల్చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే అక్కడ చెరువు నీళ్లు నిండి ఉన్నాయి. నిందితులు నలుగురు బైపాస్ రోడ్డు నుంచి ఎలా వచ్చారు, ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నించారు, ఏ ప్రాంతంలో మృతి చెందారు అనే విషయాలను ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కమిషన్ సభ్యులు బైపాస్రోడ్డులో ఉన్న ఓ హోటల్లో కొద్దిసేపు సేద తీరారు. అనంతరం అక్కడి నుంచి షాద్నగర్ పట్టణంలోని పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ పరిసరాలను పరిశీలించి నిందితులు వ్యవహరించిన తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కమిషన్ సభ్యులు షాద్నగర్ పోలీస్స్టేషన్ను పరిశీలిస్తున్న సమయంలో స్టేషన్ బయట ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి. దిశ కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దిశ నిందితుల ఎన్కౌంటర్తో మహిళలు, యువతులలో కొంత ధైర్యం వచ్చిందని, సిర్పూర్కర్ కమిషన్ క్షేత్ర స్థాయి పర్యటన అర్ధరహితంగా ఉందంటూ ఆరోపించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు సముదాయించి అక్కడి నుంచి పంపించారు. అయితే ఆందోళన కాదని, కమిషన్కు వినతి పత్రం ఇవ్వాలని స్థానికులు ప్రయత్నించారని పోలీసులు పేర్కొంటున్నారు.
షాద్నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో తొండుపల్లి టోల్గేట్ వద్ద దిశపై లైంగిక దాడి జరిగిన ప్రదేశాన్ని కమిటీ పరిశీలించింది. స్థానిక పోలీసులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ఇదిలాఉండగా కమిషన్ వస్తున్న విషయం తెలుసుకున్న దిశ కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, దిశ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దిశ తండ్రి మాట్లాడుతూ తాను కమిషన్ సభ్యులను కలిశానని, పాప ఇలా చనిపోవడం బాధాకరం, దారుణమైన సంఘటన అని కమిషన్ సభ్యులు అన్నారని వివరించారు. తనను కమిషన్ సభ్యులు పిలువలేదు. వాళ్లు వస్తున్నారనే విషయం తెలిసింది. వారిని కలిసి, మా సమస్యలు చెప్పడానికి వచ్చానని వివరించారు. ఘటనపై సభ్యులకు వివరించానన్నారు.