కంటోన్మెంట్, జూన్ 8: కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం బోర్డు సాధారణ సమావేశం జరిగింది. అంతకుముందు బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈవో అజిత్రెడ్డితో కలిసి నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న, బ్రిగేడియర్, సీఈవో, జాయింట్ సీఈవో విజయకుమార్ బాలన్ నాయర్ పాల్గొని ఏజెండాలోని పలు అంశాలపై చర్చించారు.
ప్రధానంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రక్షణ శాఖ ఆదేశాల మేరకు బొల్లారంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆసుపత్రిని పూర్తిస్థాయి కొవిడ్-19 దవాఖానగా మార్చిన నేపథ్యంలో వైద్య పరికరాలు, అదనపు సిబ్బంది నియామకం అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అభివృద్ధి పనులు, గిఫ్టెడ్, అన్గిఫ్టెడ్ లేఅవుట్లలోని భవన నిర్మాణ అనుమతులు, టెండర్ల ప్రక్రియలకు సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు ఆమోదించిందని అధికారులు తెలిపారు.
బోర్డు పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని ప్రధాన, అంతర్గత రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులకు బోర్డు తరఫున గుర్తింపు కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. వారికి ధ్రువీకరణ పత్రాలను సైతం జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. న్యూబోయిన్పల్లి ఆనందనగర్ కల్వర్టు వద్ద నాలాలో పడి మృతిచెందిన ఆనంద్సాయి కుటుంబానికి బోర్డు తరఫున తగు న్యాయం చేయాలని అధికారులకు సూచించామన్నారు. అనంతరం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యుడు పాండుయాదవ్ బ్రిగేడియర్, సీఈవోలను కలిశారు.
తిరుమలగిరిలోని మహాత్మాగాంధీ కమ్యునిటీ హాల్ ఆవరణలో చెత్తను డంప్ చేస్తుండటంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుందని, అక్కడి నుంచి ట్రెంచింగ్ పాయింట్ను త్వరితగతిన తరలించాలని కోరారు. న్యూ బోయిన్పల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చౌరస్తాను ఆనుకొని ఉన్న మిలిటరీ స్థలాన్ని రోడ్డు విస్తరణకు కేటాయించాలని కోరామని మహేశ్వరెడ్డి చెప్పారు.