మారేడ్పల్లి : సికింద్రాబాద్ గణపతి ఆలయంలో స్వామి వారి దర్శననానికి వచ్చిన ఓ భక్తుడి పై పూజారి దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….గత నెల 27న ఆదివారం ఉప్పల్ బాలాజీహిల్స్కు చెందిన వాల్మికిరావు సికింద్రాబాద్ గణపతి ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న ఉప ఆలయాలల్లో ఉన్న స్వామివారిని కూడ దర్శించుకుంటున్న సమయంలో అనుమతి లేకుండా గుడి లోపలికి ఎలా వెళ్లావ్ అని భక్తుడికి పూజారి ప్రభాకర్ శర్మ ప్రశ్నించారు.
దీంతో వీరిద్దరి మధ్య మాటా మాటా పెరుగడంతో పూజారి ప్రభాకర్ శర్మ ఆగ్రహాంతో వాల్మికిరావు పై చేయి చేసుకున్నారు. దీంతో బాధితుడు గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలయం లోపల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి అందులో ఉన్న సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఈ నెల 4న పూజారి ప్రభాకర్ శర్మను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్లోనే బెయిల్ను ఇచ్చి పంపించారు. దీని పై బాధితుడు ఆలయ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశాడు.