సిటీబ్యూరో: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆర్టీసీ బస్సుల రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీసర సమీపంలోని వెంకటాపూర్-వెంకాయపల్లి ప్రాంతంలోని కలెక్టరేట్కు జిల్లా ప్రజలు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. 3కిలోమీటర్ల దూరంలో బస్సు దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్లాల్సి వస్తున్నదని ప్రజలు చెబుతున్నారు.
ముఖ్యంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ వంటి ప్రాంతాల ప్రజలు కార్యాలయానికి వెళ్లాలంటే సికింద్రాబాద్ మీదుగా ఈసీఐఎల్ లేదా కాప్రా మీదుగా రెండు మూడు బస్సులు మార్చి చేరుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు నేరుగా కలెక్టరేట్కు వెళ్లేలా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.