సిటీబ్యూరో/ బోడుప్పల్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న చెంగిచర్ల జంతు వధశాల (స్లాటర్ హౌస్) నిర్వహణ, దాని ద్వారా వస్తున్న ఆదాయ వ్యయాలపై పారదర్శకత కరువైంది. రోజురోజుకు మాంసం వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతుంటూ.. దానికి అనుగుణంగా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం అడుగంటుతోంది. ఆధునిక స్లాటర్ హౌస్ల నిర్వహణలో జరుగుతున్న లొసుగులు, కొందరు అధికారుల అండదండలతో ప్రభుత్వ రాబడికి గండి పడుతున్న వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మేడ్చల్ జిల్లా చెంగిచర్లలోని 70 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక కబేళా నిర్వహణ వ్యవహారంలో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఈ కబేళాలో ప్రతిరోజు సగటున 3 వేల వరకు, ఆదివారాల్లో 5 వేలకు పైగా గొర్రెలు, మేకల స్లాటరింగ్ జరిగేది. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్వహణలో ఈ సంఖ్యను కేవలం 900 నుంచి 1000 లోపే చూపిస్తుండటం గమనార్హం. గతంలో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ. 1.92 కోట్ల ఆదాయం వచ్చేది. ఆ లీజు మొత్తం తకువగా ఉందని, కొత్తగా ఓపెన్ టెండర్లు నిర్వహిస్తే ఏటా రూ.4 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.