మాదాపూర్, డిసెంబర్ 1: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కు ఎటువంటి డోకా ఉండదని, ఎల్లప్పుడు పెరుగుతూనే ఉంటుందని క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అన్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి విచ్చేసి ఎస్బీఐ సీజీఎం హైదరాబాద్ సర్కిల్ రాజేశ్ కుమార్, ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్, ముంబాయి సీజీఎం ఉషా గౌతమ్తో పాటు ఎన్డబ్ల్యూ జనరల్ మేనేజర్ హైదరాబాద్ డెబాషిష్ మిశ్రా, హైదరాబాద్ డీజీఎం రవీంద్ర హిట్నా ల్లి,నారెడ్కొ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి, తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ విద్యాసాగర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ 22 శాతం మార్కెట్ వాటాతో గృహ రుణ విభాగంలో 7 ట్రిలియన్ మార్కును చేరుకోవడం గొప్ప విషయమన్నారు. ఎస్బీఐ 23 వేల బ్రాంచ్లను పూర్తి చేసుకొని కస్టమర్లకు పూర్తి చేరువలో ఉందన్నారు. ఎస్బీఐలో గృహ రుణాలు పొందే వారికి మంచి సదావకాశాన్ని ఇస్తుందని, ప్రజలు దానిని సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. ఎస్బీఐ సీజీఎం హైదరాబాద్ సర్కిల్ రాజేశ్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారులను ఆకర్షించేందుకు బిల్డర్లు, డెవలపర్లు పలు రకాల స్కీంలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 150 కి పైగా స్టాల్స్ను ప్రదర్శించారు.