సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో రోగాల ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఆగకుండా వానలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాచి చల్లార్చిన నీటినే తాగాలని అధికారులు సూచిస్తున్నారు. జలమండలి సైతం సురక్షిత నీటి సరఫరాకు చర్యలు చేపట్టింది. ఇంటింటికి 20 క్లోరిన్ బిళ్లల పంపిణీ, నీటి నమూనాలు సేకరిస్తున్నది. 24 గంటల పాటు అత్యవసర బృందాలను అందుబాటులో ఉంచింది. దోమల నియంత్రణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం 100 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. మరోవైపు భాగ్యనగరంలో అంచనాలకు మించి వానలు కురుస్తున్నాయి. జూలైలోనే సాధారణం కంటే 101 శాతం అధిక వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
గ్రేటర్పై వరుణుడు విరుచుకుపడుతున్నాడు. వాతావరణ శాఖ అంచనాలను మించి రెండు సంవత్సరాలుగా నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కేవలం 14 రోజుల్లోనే 404 శాతం వర్షపాతం నమోదవ్వగా ఈ సంవత్సరం జూలైలోనే సాధారణం కంటే 101 శాతం అధిక వర్షపాతం నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం అక్టోబర్ 13న హయత్నగర్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. ఈ సంవత్సరం జూలై 14న నాగోల్ బండ్లగూడలో 21.2 సెం.మీల వర్షం కురిసింది. గడిచిన 30 ఏండ్లలో ఈ స్థాయి వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరోవైపు జూలై మాసానికే సాధారణం కంటే 101 శాతం అధికంగా వర్షపాతం నమోదవడంతో వచ్చే మరో రెండు నెలల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరం కురిసిన భారీ వర్షంతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం గ్రేటర్లో వర్షపాతం సాధారణమేనని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత సంవత్సరంలో సాధారణం కంటే 130 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలుపగా.. సాధారణం కంటే 404 శాతం వర్షపాతం నమోదయ్యింది. ఇక ఈ సంవత్సరం సాధారణం కంటే అధికంగా 101 శాతం వర్షపాతం నమోదు కావడంతో అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. అయితే వాతావరణ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేమని.. నెల రోజుల ముందు చెప్పిన అంశాల్లోనూ మార్పులు రావచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. గత, ప్రస్తుత సంవత్సరాల్లో ఉపరితల ద్రోణులు, ఆవర్తనాలు, అల్పపీడనాలతోనే (సిస్టమ్స్) అధిక వర్షాలు కురుస్తున్నాయని వివరిస్తున్నారు.
గత రికార్డులను చెరిపేస్తూ హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదవుతున్నది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరం ఆగస్టు 24న హైదరాబాద్లో నమోదైన వర్షపాతం 24.1 సెంటీమీటర్లు. అదే నగర చరిత్రలో రికార్డు వాన. అయితే గత సంవత్సరం అక్టోబర్ 13న హయత్నగర్లో కురిసిన కుండపోత వాన 30సెం.మీలతో రికార్డును తిరగరాసింది. 1926కు పూర్వం నిజామియా పేరుతో ఉన్న వాతావరణ కేంద్రం..1926లో బేగంపేట ఎయిర్పోర్టు వాతావరణ కేంద్రంగా పరిగణలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. 1973లో స్వతంత్రంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏర్పడగా అప్పటి నుంచి మొన్నటి వరకు నమోదైన రికార్డు వర్షపాతం 24.1 సెంటీమీటర్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ 13న హయత్నగర్లో 30 సెంటీమీటర్లు, ఈ నెల 14న బండ్లగూడలో 21.2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో మరోసారి రికార్డులు బ్రేకులు అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు అధికారులు.
వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని చెరువులు, జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సురక్షిత తాగునీటి విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జలమండలి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సింగూరు, కృష్ణా, గోదావరి, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నుంచి నగరానికి కావాల్సిన నీటిని తీసుకుంటున్న అధికారులు శుద్ధి చేసిన తర్వాతే పంపిణీ చేస్తున్నారు. నగరవాసులు కూడా తాగునీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డయేరియా లాంటి వ్యాధులను అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
వానకాలంలో నీటి సరఫరాలో తలెత్తే సమస్యలపై ముందే అంచనా వేసిన జలమండలి అధికార యంత్రాంగం ఈ మేరకు రక్షిత నీటి సరఫరాకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వర్షాకాలంలో సరఫరా అయ్యే నీటిలో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రజార్యోగంపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం. ఇది గుర్తించిన జలమండలి అధికారులు ప్రస్తుతం సంస్థ పరిధిలో 290 క్లోరినేషన్ పాయింట్లు ఉండగా, అదనంగా మరో 20 పాయింట్లను ఏర్పాటు చేశారు. అత్యున్నత ప్రమాణాలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద నీటిని శుద్ధి చేయడంతో పాటు పలు పర్యాయాలు క్లోరినేషన్ కలిపే ప్రక్రియను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపు ద్వారా ఉన్నతాధికారులు అనుక్షణం పరిశీలిస్తున్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నుంచి తరలివస్తున్న జలాలను మార్గమధ్యలో శుద్ధి చేసి క్లోరినేషన్ చేస్తుంటారు. చివరగా సరఫరా చేసే ముందు నగరంలోని సర్వీసు రిజర్వాయర్ల వద్ద క్లోరిన్ కలుపుతుంటారు. నిబంధనల ప్రకారం మిలియన్ లీటర్ల శుద్ధికి కిలో క్లోరిన్ కలపాల్సి ఉంటుంది. అప్పుడే రిజర్వాయర్ వద్ద 2 పీపీఎం (పార్ట్ ఫర్ మిలియన్) ఉంటుంది. వినియోగదారుడికి చేరే సమయంలో క్లోరిన్ శాతం 0.5 పీపీఎం ఉంటే చాలు.
నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి 20 క్లోరిన్ బిళ్లలను జలమండలి అధికారులు సరఫరా చేస్తున్నారు. అలాగే నీటి సంబంధ వ్యాధులపై సహాయక సంఘ బృందాలతో అవగాహన కల్పిస్తున్నారు. నీటి కాలుష్య ప్రాంతాలను గుర్తించి శాంపిళ్లు సేకరిస్తున్నారు. పరీక్షలు చేపట్టి కాలుష్యం తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు. దవాఖానలు, బస్తీల నీటి సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించామని.. ప్రతిరోజు 2500 ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ సేకరణ జరుగుతున్నదని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాక మెట్రో కస్టమర్ కేర్ (ఎంసీసీ), డయల్ యువర్ ఎండీ, మీటర్ యువర్ ఎండీ కార్యక్రమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తూ వెంటవెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నారు.
నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలమండలి అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అంతేకాక నోడల్ అధికారులు నియమించి మూడు షిఫ్టుల్లో పని చేసేలా చూస్తున్నారు. మరోవైపు మ్యాన్హోళ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైనా మ్యాన్హోల్ మూత తెరిచినా లేదా ధ్వంసం అయినట్టు గుర్తిస్తే వెంటనే కస్టమర్ కేర్ నంబర్ 155313కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): దోమల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. దోమకాటుతో వచ్చే డెంగీ, మలేరియా తదితర జ్వరాలపై అవగాహన కల్పించేందుకు 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను స్వచ్ఛందంగా తొలగించాలని విస్తృతంగా ప్రచారం చేపడుతున్నది. అంతేకాక మూసీ, ఇతర మురుగు కాల్వల్లో ఉత్పత్తయ్యే క్యూలెక్స్ దోమల నివారణకు యాంటీ లార్వా మందులను ఎంటమాలజీ సిబ్బంది స్ప్రే చేస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు ట్రై పోలీస్ కమిషనరేట్ల ట్రాఫిక్ విభాగం పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షం నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తిస్తూ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వరద నీటిని తొలగిస్తున్నారు. అంతేకాక వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షం పడిపోయిన తర్వాత ఒక్కసారిగా వాహనదారులు రోడ్లపైకి రావద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): భారీగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. జలుబు, జ్వరం, దగ్గుతో పాటు దోమలు, కలుషిత నీటితో వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపై పోరాడేందుకు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు నడుం బిగించారు. వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో రోగాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం అలర్జీ, అస్తమా ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒక రోజు డ్రై డే పాటించి ఇండ్లల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి. కురుస్తున్న వర్షాలతో నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ. సాధ్యమైనంత వరకు బయటి ఆహారం తీసుకోవద్దు. వేడి వేడి ఆహారం తినాలి. జ్వరం, దగ్గు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, వైద్యారోగ్య శాఖాధికారి, రంగారెడ్డి జిల్లా
ముసురుతో జలుబు, దగ్గుతో పాటు జ్వరం రావడం సాధారణం. అయితే ప్రస్తుత కరోనా సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వర్షాకాలంలో కలుషిత నీరుతో డయేరియా వచ్చే అవకాశం ఉంది. దోమల వృద్ధితో డెంగీ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వానలో తడవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. సీజనల్ వ్యాధుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.-డాక్టర్ శ్రీధర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా వైద్యశాల