శంషాబాద్ రూరల్ : రామానుజాచార్యుల సువర్ణ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రిదండి చిన్నజీయర్స్వామితో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న 12వ రోజు సమతామూర్తి ఉత్సవాలకు ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సువర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
216 అడుగుల భారీ సమతామూర్తి విగ్రహంతో పాటు 108 దివ్యదేశాలను పరిశీలించారు.అనంతరం ప్రవచన మండపానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాం నిర్మాణం చేసిన చిన్నజీయర్స్వామి, మైహోంగ్రూపు సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావును అభినందించారు.
ఆదివారం మధ్యాహ్నాం 3.30 గంటలకు డిల్లీ నుంచి బేగంపేట్ విమానశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, రాష్ట్ర గవర్నర్ తమిళసై స్వాగతం పలికారు. అక్కడి నుంచి హలికాప్టర్ ద్వారా నేరుగా ముచ్చింతల్ సమతామూర్తి ప్రాగణంలో దిగిన ఆయన సువర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తిరిగి బేగంపేట్ విమానశ్రయానికి తిరిగి వెళ్లారు. ఉదయం దివ్యదేశాలలోని 21 ఆలయాలను చిన్నజీయర్ స్వామి ప్రాణప్రతిష్ట చేశారు. ఉత్సవాలలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్, ప్రవచన మండపంలో ఆయోధ్య నుంచి వచ్చిన శ్రీమాన్ కేశవాచార్యులు, మైహోంగ్రూపు సంస్థల ఎండీ జూపల్లి జగపతిరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
రామానుజాచార్యులు సమతామూర్తి విగ్రహాన్ని చూడటానికి ఆదివారం ఉదయం భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.