హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.