సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిపై ఆయుధాలతో దాడి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా నుంచి పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలో నేరాలకు పాల్పడటంతో పాటు అక్కడి పోలీసులపై దాడి చేశారు. అక్కడి పోలీసుల నుంచి తప్పించుకొని హైదరాబాద్కు వచ్చారు. సైబరాబాద్ పరిధిలో కూడా చైన్ స్నాచింగ్లకు పాల్పడి.. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ను కత్తితో పొడిచి గాయపరిచారు. సాహసం చేసిన పోలీసులు.. ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకున్నారు.
గచ్చిబౌలిలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ కలిసి ఈనెల 21న పల్సర్ బైక్పై హైదరాబాద్కు వచ్చారు. నగరంలో ఉంటున్న స్నేహితుడిని తీసుకొని తిరిగి కర్ణాటకకు వెళ్లారు. 22 నుంచి 24 తేదీ వరకు ఈ ముగ్గురు కర్ణాటకలోని పలు బంగారం దుకాణాల్లో దోపిడీలు చేసేందుకు స్కెచ్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని పలు చోట్ల దోపిడీకి ప్రయత్నించి విఫలమయ్యారు. 24న కర్ణాటక కల్బుర్గి పీఎస్ పరిధిలోని హుద్నూర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఓ బంగారం దుకాణంలో దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. కల్బుర్గి పీఎస్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ గురుమూర్తి, సంజీవ్కుమార్ అడ్డుకున్నారు. నేరగాళ్లు ఇనుప రాడ్ సాయంతో పోలీసులపై దాడి చేసి పారిపోయి.. 25న హైదరాబాద్కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి గచ్చిబౌలి, కూకట్పల్లిలో చైన్ స్నాచింగ్ చేసి జగద్గిరిగుట్టలో దాచుకున్నారు. 26న అక్కడి నుంచి బయలుదేరి 10 గంటల సమయంలో మియాపూర్, ఆర్సీపురం పీఎస్ పరిధిలో చైన్స్నాచింగ్లకు పాల్పడ్డారు. హెచ్ఐజీ నుంచి ఎమ్ఐజీ మీదుగా వీరు వెళ్తుండగా కానిస్టేబుళ్లు యాదయ్య, దేబశ్, రవి గమనించి రెండు బైక్లపై వెంబడించారు. కానిస్టేబుల్ యాదయ్య ఎదురుగా వెళ్లాడు. పట్టుకునే ప్రయత్నం చేయగా.. స్నాచర్ ఇషాన్ కత్తితో 7 సార్లు పొడిచాడు. కానిస్టేబుళ్లు దేబశ్, రవి పరిస్థితిని గమనించి స్థానికుల సాయంతో ఇద్దరు స్నాచర్లను పట్టుకున్నారు.
ఆ రోజు రాహుల్ బైక్ నడుపుతుండగా, ఇషాన్ నిరంజన్ గొలుసులను తెంపాడని, కానిస్టేబుల్ యాదయ్యపై ఇషాన్ కత్తితో దాడి చేసినట్లు గుర్తించారు. ఈ ముఠా సైబరాబాద్ పరిధిలో 4 స్నాచింగ్లు చేసింది. మరోచోట స్నాచింగ్కు యత్నించారు. పట్టుబడిన నిందితులపై కర్ణాటకలో 13 చోరీ కేసులున్నాయి. నిందితుల నుంచి రెండు తుపాకులు, 13 బుల్లెట్లు, 47 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. స్నాచింగ్లకు ఉపయోగించిన పల్సర్ వాహనం కూడా గుల్బర్గాలో చోరీ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, కత్తిపోట్లకు గురైన కానిస్టేబుల్ యాదయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, యాదయ్యతోపాటు కానిస్టేబుళ్లు దేబశ్, రవి తెగువ, ధైర్యసాహసాలతో తెలంగాణ పోలీసుల ప్రతిష్ట పెరగడంతోపాటు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీపీ వెల్లడించారు. సమావేశంలో క్రైం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, బాలానగర్ డీసీపీ సందీప్, మాదాపూర్ జోన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. చైన్ స్నాచర్లను పట్టుకోవడంలో సహకరించిన అధికారులకు సీపీ రివార్డులను అందజేశారు.
నెత్తురు కారుతున్నా.. పట్టువిడవలేదు
ఆపరేషన్ ‘సిల్వర్ పల్సర్ స్నాచర్స్’ స్నాచర్స్కు షాక్ ఇచ్చింది. పోలీసుల తెగింపు ఫలించింది. స్నాచర్ల దాడిలో నెత్తురు కారుతున్నా పోలీసులు పట్టువిడవలేదు. వెంటాడి స్నాచర్లను పట్టుకున్నారు. ఈనెల 25న గచ్చిబౌలి, కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మూడు స్నాచింగ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాదాపు 50 మందికి పైగా మాదాపూర్ జోన్ పోలీసులతో పాటు సీసీఎస్, ఎస్వోటీ బృందాలు ప్రత్యేకంగా గాలించాయి. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాపింగ్ చేసుకుని ఎగ్జిట్ పాయింట్ను అంచనా వేశారు. నేరగాళ్లను వల పన్ని పట్టుకున్నారు.
నిఘా పెట్టి..పట్టుకున్నాం..
సమాచారం అందిన వెంటనే స్నాచర్ల కోసం నిఘా పెట్టాం. వారు వెళ్తున్న మార్గాన్ని గమనించి..వెంబడించాం. వారి వద్ద ఆయుధాలు ఉన్నా..పట్టువిడవలేదు. కానిస్టేబుల్ యాదయ్యకు కత్తిపోట్లు గాయాలయ్యాయి. అయినా వారిని పట్టుకున్నాం.
– దబేశ్, కానిస్టేబుల్, మాదాపూర్ సీసీఎస్..
ప్రజా భద్రతే.. మాకు ముఖ్యం
మియాపూర్లో 10 గంటలకు కనిపించారని తెలియగానే ఎగ్జిట్ రూటులో ఉన్న నేను, దబేశ్, యాదయ్యతో కలిసి స్నాచర్లను ఫాలో అయ్యాం. స్థానికుల సాయంతో పట్టుకున్నాం. ఉద్యోగంలో చేరే సమయంలో ప్రతిజ్ఞ చేశాం.. ప్రజా భద్రతే మాకు ముఖ్యం.
– రవి, కానిస్టేబుల్ సీసీఎస్ మాదాపూర్