సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): గొడ్డలి, కత్తులు, ఇనుప రాడ్లతో సంచరిస్తూ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్కు చెందిన 9 మంది పార్థీ గ్యాంగ్ సభ్యులపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ గురువారం పీడీ యాక్ట్ను విధించారు. ఈ ముఠా రుద్రాక్షలు, ఆయుర్వేదిక్ మూలికలను విక్రయించే ముసుగులో నిర్మానుష్యంగా ఉండే శివారు ప్రాంతాల్లో సంచరిస్తారు. తాళం ఉన్న ఇండ్లతో పాటు ఇంటిలో ఒంటరిగా ఉండే వారిని ఎంచుకుని చోరీలకు తెగబడుతారు. ఫోన్ మాట్లాడుతూ ఒంటిరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని మొబైల్ ఫోన్లను లాక్కెలుతారు. 2020-2021లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ముఠా సుమారు 20 నేరాలకు పాల్పడింది. వీరి చర్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ముఠాను మార్చి నెలలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఈ ముఠా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్టాలో కూడా నేరాలకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వీరి ఆగడాల నుంచి ప్రజలను కాపాడేందుకు ముఠా పై పీడీ యాక్ట్ను విధించి, ఏడాది పాటు జైలులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.