సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): గంజాయి దందాపై రాచకొండ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ర్టాలకు వయా హైదరాబాద్ మీదుగా వెళ్లకుండా పూర్తి నిఘా పెట్టడంతో ఐదేండ్లలో మొత్తం 7,371 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేసి.. ‘మత్తు’ వదిలిస్తున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికంగా విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని..కొందరు గంజాయితో పాటు డ్రగ్స్ విక్రయించారు. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సారథ్యంలో పోలీసులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వ్యాపారాలపై ఉక్కుపాదం మోపారు. బ్యాచిలర్స్ ఉండే కాలనీలు, అపార్ట్మెంట్లు ఇతర నివాస ప్రాంతాలపై నజర్ పెట్టారు. గంజాయి సేవించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో పరిస్థితి మొత్తం చక్కబడింది.
మత్తు దందాలపై ఐదేండ్లలో మొత్తం 145 కేసులు నమోదు చేశారు. 382 మందిని అరెస్టు చేశారు. గం జాయి, హషీష్ అయిల్, హెరాయిన్, కొకైన్, ఒపీయమ్ పప్పీ విత్తనాలు, అల్ఫ్రాజోలం, బ్రౌన్షుగర్, అంఫెటామైన్, యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిల్వ ఉంచిన ఓ ఇంటిని కూడా 133 సీఆర్పీసీ కింద జప్తు చేశారు. పోలీసులు మోపిన అభియోగాలు కోర్టు విచారణలో నిర్ధారణ కావడంతో నిందితులకు అత్యధికంగా 10 ఏండ్ల జైలు శిక్ష పడింది.
అధికంగా గంజాయిని విశాఖపట్నం, చింతపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, ఒడిశా, బీహార్ల నుంచి తీసుకుని వాటిని వయా హైదరాబాద్ మీదుగా ముంబై, గోవాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం గంజాయి ముఠాలు అనేక రకాల మార్గాలను ఎంచుకుని పోలీసుల దృష్టిని మళ్లించి.. తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. రాచకొండ పోలీసులు ఈ తరహా సరఫరాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి.. గంజాయి దందాకు చెక్ పెట్టేందుకు నిత్యం ప్రయత్నం చేస్తున్నారు.
గంజాయి వ్యాపారం నడిపి అమాయక యువతను మత్తుకు బానిసలు చేస్తున్న నిందితులపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్లు నమోదు చేశారు. ఇలా మూడు కేసుల్లో పట్టుబడిన నిందితులపై పీడీ యాక్ట్ను విధించి ఏడాది పాటు జైలులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 64మందిపై పీడీ యాక్ట్ను విధించి గంజాయి, డ్రగ్స్ దందాకు బ్రేక్ వేశారు.
ఉప్పల్ పీఎస్లో క్రైం నెం. 871/2014 లో నిందితుడికి 10 ఏండ్ల జైలు, లక్ష జరిమానా.
వనస్థలిపురం పీఎస్ క్రైం నం. 048/2014 లో నిందితుడికి ఏడాది జైలు, జరిమానా.
కుషాయిగూడ పీఎస్ క్రైం నం.301/2015 లో నిందితుడికి ఆరు నెలలు జైలు, జరిమానా.
పహాడిషరీఫ్ పీఎస్ క్రైం నం. 534/2016 లో నిందితుడికి 10 వేలు జరిమానా.
ఆదిబట్ల పీఎస్ క్రైం నం. 169/2017 లో నిందితుడికి ఆరు నెలలు జైలు, జరిమానా.
నేరేడ్మెట్ పీఎస్ క్రైం నం. 295/2018 నిందితుడికి ఆరు నెలలు జైలు, జరిమానా.
మీర్పేట్ పీఎస్ క్రైం నం. 227/2018 లో నిందితుడికి జైలు, జరిమానా.