సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా.. ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది. సమాచారం సెకన్లలో లక్షలాది మందిని చేరుతుండటంతో ఇప్పుడు పార్టీలన్నీ సామాజిక మాధ్యమాల వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆశావహులు ప్రత్యేకంగా వారి ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియా డెస్క్లు ఏర్పాటు చేసుకొని… రోజువారీ ప్రచార వివరాలు, ప్రజలతో మమేకమయ్యే సందర్భాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేయడానికి అవగాహన ఉన్న వారిని ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు. అభ్యర్థికి పాజిటివ్ అంశాలను జత చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను రూపొందించి షేర్ చేయడానికి వీడియో ఎడిటర్లు, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు, కంటెంట్ రైటర్లను నియమించుకుంటున్నారు.
ఇప్పటికే అభ్యర్థులు ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్ చానెల్ ఇలా అనేక సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు సోషల్ మీడియాలో తమకు టికెట్ వస్తుందని మద్దతు ఇవ్వాలని పోస్టులు వైరల్ చేసుకుంటున్నారు.అభ్యర్థులు తమకు మద్దతుగా ప్రచారం చేయాలని అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న పేజీ నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. లక్ష సబ్స్ర్కైబర్స్ ఉన్న యూట్యూబ్ పేజీకి ఓ ధర, ఆ పై ఉన్న పేజీలకు ఓ ధరను నిర్ణయిస్తూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇప్పటికే వార్త కంటెంట్తో ఉన్న యూట్యూబ్ పేజీలకు మరింత డిమాండ్ పెరిగింది. అభ్యర్థి ప్రచారం నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కంటెంట్ సృష్టించి వీడియోలు ప్రసారం చేసి అభ్యర్థికి ఆదరణ వచ్చేలా యాక్టివిటీ అంతా సోషల్ మీడియా నిర్వాహకులే చూసుకుంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్లతో జోరందుకోనుంది.