లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ మహానగరం రాష్ట్ర ఏర్పాటు నాటికి కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. నిరాదరణకు గురైన నీటి వనరులకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో పూర్వ వైభవం కల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నగరవాసులకు ప్రాణవాయువును అందించింది. పచ్చని పొదరిల్లులతో పార్కులన్నీ ఆక్సిజన్ హబ్లుగా మారాయి. నిండైన నీళ్లతో చెరువులు జీవరాశులకు నిలయమయ్యాయి. జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు మహానగర ముఖచిత్రాన్ని మార్చాయి. 2012తో పోలిస్తే దశాబ్ద కాలంలోనే నగర జీవ వైవిధ్యం గణనీయంగా మెరుగుపడింది. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం విడుదల చేసిన హైదరాబాద్ నగర జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరించే నివేదిక (సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్) ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2012తో పోలిస్తే 2021లో జీవ వైవిధ్య ఇండెక్స్లో హైదరాబాద్ మహా నగరం 21 పాయింట్ల మేర మెరుగుపడటం విశేషం.
సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు సరస్సుల నగరంగా పిలువబడే హైదరాబాద్ తెలంగాణ ఏర్పడేనాటికి కాంక్రీట్ జంగిల్గా ఎడారిని తలపించింది. వేలాది చెరువులు నిరాదరణకు గురై.. నీటి వనరులపై ఆధారపడే జీవరాశుల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, హరితహారంతో పాటు పట్టణ జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు చేపట్టిన చర్యలు మహా నగర ముఖచిత్రాన్ని మార్చాయి. 2012తో పోలిస్తే దశాబ్ద కాలంలోనే నగర జీవ వైవిద్యం గణనీయంగా మెరుగుపడింది. దీంతో అనూహ్యంగా పెరిగిన పట్టణ అటవీ ప్రాంతం, పూర్వ వైభవాన్ని సంతరించుకున్న నీటి వనరులతో హైదరాబాద్ మహానగరం సకల జీవరాశులకు వలస కేంద్రంగా మారింది. మంగళవారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన హైదరాబాద్ నగర జీవ వైవిధ్య్యాన్ని ఆవిష్కరించే నివేదిక (సిటి బయోడైవర్సిటీ ఇండెక్స్) ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2012తో పోలిస్తే 2021లో జీవ వైవిధ్య ఇండెక్స్లో హైదరాబాద్ మహా నగరం 21 పాయింట్ల మేర మెరుగుపడటం విశేషం.
నగరంలోని జీవ వైవిధ్యం ఎలా ఉందనే దానిపై పలు ప్రామాణికాల ఆధారంగా అధ్యయనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గతంలో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో కాప్-11 పేరిట పలు నగరాల్లో అధ్యయనం చేపట్టారు. 2012లో హైదరాబాద్… 2017లో కోల్కతాలో ఈ జీవ వైవిధ్య అధ్యయనం జరిగింది. ఈ మేరకు 23 అంశాలను (ఇండికేటర్స్) ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ క్రమంలో 92 పాయింట్లకుగాను హైదరాబాద్ నగరం 36 పాయింట్లు సాధించింది. అనంతరం ఈ నగరంలోనూ ఈ తరహా అధ్యయనం జరగలేదు. తొలిసారిగా 2021లో తెలంగాణ ప్రభుత్వం జీవ వైవిధ్య అధ్యయనాన్ని చేపట్టింది. పట్టణీకరణలోనే కాకుండా జీవవైవిధ్యానికి సంబంధించిన 23 ప్రామాణిక అంశాల్లో గ్రేటర్ హైదరాబాద్ అత్యంత మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 23 ప్రామాణిక అంశాల్లో నిర్వహించిన అధ్యయనంలో 92 పాయింట్లకు గాను 57 పాయింట్లు 2021లో వచ్చాయి. అదే 2012లో ప్రకటించిన జీవవైవిధ్య నివేదికలో 92 పాయింట్లకు గాను 36 వచ్చాయి. గత 9 ఏళ్లలోనే ఎంతో మెరుగైన స్థానం హైదరాబాద్ మహానగరానికి దక్కింది. హైదరాబాద్ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ 2021లో నేటివ్ బయోడైవర్సిటీ ఇన్ ద సిటీలో కేటగిరిలో 40 పాయింట్లకు 27 పాయింట్ల స్కోర్ వచ్చింది. అదే 2012లో మాత్రం 40 పాయింట్లకు గాను 15 పాయింట్లే వచ్చాయి. అత్యంత శాస్త్రీయంగా, ఆయా రంగాలకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో జరిగిన అధ్యయనంతో ప్రామాణిక అంశాల మెరుగుదల గుర్తించారు.
నివేదికలోని పలు అంశాలు.. ప్రకృతి వరప్రసాదంగా నగరం..
హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం రెండు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 1,350 నీటి వనరులు ఉన్నాయి. మూసీనది, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, హుస్సేన్సాగర్, శామీర్పేట్తోపాటు ఉప్పుగూడ చెరువులు ప్రధాన జలవనరులుగా ఉన్నాయి. శామీర్పేట్ చెరువు, హుస్సేన్సాగర్ లేక్, కుత్బుల్లాపూర్లోని ఫాక్స్సాగర్ లేక్, మీర్ఆలం ట్యాంక్, పటాన్చెరు సరస్సులు స్థానిక పక్షులకు నిలయంగా ఉన్నాయి. అయితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కాలానుగుణంగా వలస వచ్చే పక్షులను ఆకర్షిస్తాయి నగరంలో 1600 హెక్టార్ల విస్తీర్ణంలో ముఖ్యమైన రాతి శిలల సహజ సంపద కూడాఉండటం నగరానికి గొప్పవిషయం. వృక్షసంపద పరంగా చూసుకుంటే.. దక్షిణ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, దక్షిణ ఉష్ణమండల ముళ్ల అడవులు ప్రబలంగా ఉన్నాయి.
విభిన్న వృక్షజాలానికి కేరాఫ్ కేబీఆర్ పార్కు..
వీటిలో చాలా అడవులు జూలాజికల్ పార్, బొటానికల్ గార్డెన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇనిస్టిట్యూషనల్ ప్రాంతాలుగా 2012లో మార్చారు. ముఖ్యమంగా నగరంలో రెండు జాతీయ పారులు కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు (కేబీఆర్), మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్కు ఉండటంతో జీవ వైవిధ్యత ఉట్టిపడుతున్నది. కేబీఆర్ పార్కు మాత్రం వృక్షజాలంతోపాటు జంతుజాలానికి అనేక రకాలుగా హితకారిణిగా కొనసాగుతున్నది. కేబీఆర్ పార్కులో టేకు (టెక్టోనా గ్రాండిస్), గంధపు చెక్క(శాంటాలమ్ ఆల్బమ్), వేప (ఆజాది రచ్తా ఇండికా), బాబుల్ (ఆకాసియా నిలోటికా), పాలాష్ (బుటియా మోనోస్పెర్మా) వంటి అనేక వృక్ష సంపదను తన ఒడిలో ఇమిడ్చికుంది. ఇక మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్ బుష్ వృక్షసంపద, గడ్డి భూములతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. మొత్తం 1,305 రకాల వివిధ జాతుల మొక్కల్లో 577 స్థానికంగా లభించే మొక్కలు, మిగతా 728 ఇతర జాతులకు చెందినవి ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిశాట్ వంటి సంస్థాగత ప్రాంతాల క్యాంపస్లలో విస్తృతమైన వృక్షజాతులు వైవిధ్యాన్ని కలిగిఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 141 రకాల సీతాకోకచిలుకలు, 42 రకాల సాలెపురుగులు, 60 జాతుల చేపలు, 30 రకాల ఒడొనేట్లు, 16 రకాల ఉభయచర జాతులు, 41 రకాల సరీసృపాల జాతులు, 315 పక్షి జాతులు, 58 క్షీరద జాతుల సహజ సంపదను మన మహానగరం కలిగి ఉందని తెలియజేస్తున్నది.
జీవ వైవిధ్యం పెంపొందించడంలో కీలకంగా మారిన సంస్థలు..
హైదరాబాద్ మహానగరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందేలా చేయడంలో పలు సంస్థలు కీలకంగా వ్యవహరించాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు(ఎస్సీబీ), తెలంగాణ ఫారెస్ట్ డిపార్టుమెంట్, స్టేట్ హార్టికల్చరల్ డిపార్టుమెంట్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డు, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు నగరానికి సంబంధించిన జీవవైవిధ్యం మెరుగైన రితీలో ఉండేందుకు తమ వంతు కృషి చేశాయని బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ ఆఫ్ హైదరాబాద్ పేర్కొంది.
స్థిరంగా పక్షి జాతులు..
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో జీవ వైవిద్యం మెరుగైన స్థితిలోనే ఉంది. అందుకు నిదర్శనం 2012లో ప్రకటించిన ర్యాంకింగ్లో పక్షిజాతులు విభాగంలో స్కోర్ 2021లోనూ మెరుగ్గానే ఉందని నివేదికలో పేర్కొన్నారు. నగరం నలుమూలలా విస్తరిస్తూ కాంక్రీట్ జంగిల్గా మారుతున్నా పక్షులు నివాసం ఉండేందుకు అనుకూలంగా చెరువులు, పార్కులు, రాళ్ల గుట్టలు, సంస్థల కార్యాలయాల్లోని పచ్చదనం దోహదం చేసిందని నిపుణులు గుర్తించారు. ఈ అధ్యయనంలో మొత్తం 315 పక్షి జాతులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో పక్షులను గుర్తించడంలో ప్రత్యేక పాయింట్ల విధానాన్ని పాటించారు. 3 పాయింట్ల విభాగంలో 47 నుంచి 68 పక్షులు ఉన్నట్లు గుర్తించంగా,దీనికి స్కోరు 3 లభించింది. ఇది మెరుగైన స్కోరుగా నిపుణులు పేర్కొన్నారు. ఇలా హైదరాబాద్ నగరానికి ఉన్న సహజ సిద్ధమైన జీవవైవిద్య వనరులను పరిరక్షించడం ద్వారా నగర జీవవైవిధ్య సూచిలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశం కలిగింది.
జీవవైవిధ్య హబ్స్గా గుర్తించిన ప్రాంతాలు..
దక్షిణ ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు, దక్షిణ ఉష్ణమండల ముళ్ల అడవులు, రాతి శిలల ప్రాంతాలు, పలు సరస్సులు, ఇతర నీటి వనరులు, మూసీ నదీతీర ప్రాంతం, రక్షిత ఉద్యానవనాలు, జాతీయ పార్కులు, ల్యాండ్ బ్యాంకులు, అర్బన్ పార్కులు తదితర ప్రాంతాలను గుర్తించినట్లు నివేదిక తెలిపింది.