బండ్లగూడ, జూన్ 30 : కరోనా కష్టకాలంలో అనేక మంది ఆక్సిజన్ అందక అవస్థలు పడ్డారు. అలాంటి వారి ఇక్కట్లను కండ్లారా చూసిన లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న షేక్ మహ్మద్ రయ్యన్, ఎండీ ఆదిల్, మహ్మద్ మిస్బాఉద్దీన్లు తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించి బాధితులకు బాసటగా నిలువాలని నిర్ణయించుకున్నారు. రూ.20 వేల ఖర్చుతో వాటర్ ప్యూరిఫయర్ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను తయారు చేసి ఒకే సారి ఇద్దరు వినియోగించుకునే అవకాశం కల్పించారు. మంగళవారం కళాశాలలో విద్యార్థులు తయారు చేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ప్రదర్శించి, దాని పనితీరును వివరించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ తౌసిఫ్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను తయారుచేయడం అభినందనీయమన్నారు.