గుతుకులు లేని విశాలమైన రోడ్డు.. చుట్టూ ఆహ్లాదం పంచే వాతావరణం.. దీన్ని వాహనదారులు సరదాగా ఆస్వాదిస్తూ.. ఔటర్పై ఎక్సలేటర్ తొక్కేస్తున్నారు. వాహనం వేగ పరిమితి 100 దాటి ఏకంగా 140కి చేరుకుంటుంది. కంట్రోల్ కాకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు విధించినా గాలికొదిలేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు (తొమ్మిది నెలల్లో) 1.13 లక్షల చలాన్లు విధించడం గమనార్హం. దీన్ని బట్టి వాహనదారులు ఎంతటి రాష్ డ్రైవింగ్ చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నది. అతివేగంగా ప్రయాణిస్తున్న వాహనదారులకు ఇది సరదా అనిపించినా.. ఇతర వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇలాంటి వారికి మూకుతాడు వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు విధించారు. ఔటర్పై 100 స్పీడ్ దాటితే ఓవర్ స్పీడ్ కింద పరిగణిస్తూ రూ.వెయ్యి చలాన్ విధిస్తున్నారు. అయినప్పటికీ వాహనదారుల తీరు మారడం లేదు. 2021 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 1.13 లక్షల చలాన్లు విధించడమే ఇందుకు నిదర్శనం. వీరందరి నుంచి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు వసూలు చేయనున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 79,396, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 34,300 ఓవర్ స్పీడ్ చలాన్లు జారీ చేశారు. ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 32మంది, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు మృతి చెందారు. వీరందరూ ఓవర్ స్పీడ్ కారణంగానే మృతిచెందినట్లు పోలీసు దర్యాప్తులో తేల్చారు. అయితే ఔటర్పై 12 స్పీడ్ లేజర్ గన్లతో వాహనాల స్పీడ్ను షూట్ చేస్తున్నారు. లేజర్ సెన్సార్ ద్వారా 100 స్పీడ్ దాటిన వాహనాన్ని గుర్తించి చలాన్ జారీ చేస్తున్నారు.
సైబరాబాద్ పరిధిలోకి వచ్చే ఓఆర్ఆర్ మార్గంలో ఐటీ ఉద్యోగులు, వివిధ కళాశాలల విద్యార్థులు అతివేగంగా ప్రయాణిస్తూ వేగాన్ని 140 దాటిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వీఐపీలు కూడా ఓఆర్ఆర్పై వేగ పరిమితిని మించడంతో చలాన్లు నమోదవుతున్నాయి.
ఓఆర్ఆర్పై కొంత మంది వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొందరు రిలాక్స్ కోసం వాహనాలు నిలుపుతుండగా.., మరికొందరు ఓఆర్ఆర్పై ఉన్న అందాలను ఆస్వాదించేందుకు నిలుపుతూ.., సెల్ఫీలకు ఫోజులిస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓఆర్ఆర్పై వాహనాలను నిలిపిన వారిని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ కింద 9380 వాహనాలకు రూ.వెయ్యి చొప్పున చలాన్ విధించారు.
ఔటర్పై కొందరు నిర్లక్ష్యంగా రాంగ్రూట్లో వెళ్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని టీఎస్ అప్పా జంక్షన్, గచ్చిబౌలి, రావిరాల, నార్సింగి, శంషాబాద్ తదితర మార్గాల వద్ద ఈ రాంగ్ రూట్ బెడద ఉందని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారికి సైబరాబాద్ పోలీసులు ఈ ఏడాది 3588, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు 38 వాహనాలకు రూ.వెయ్యి చొప్పున చలాన్ విధించారు. .