అధ్యాపకుల పోస్టులకు కేబినెట్ ఆమోదం
అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు
బోర్డు ఏర్పాటు వెంటనే నోటిఫికేషన్లు
రెండు మూడు రోజులలో విధి విధానాలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీలలో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఓయూ, జేఎన్టీయూతో పాటు మిగితా యూనివర్సిటీలలో కలిపి మొత్తం.. 4,794 పోస్టులు భర్తీ కావడానికి మార్గం సుగమం అయింది. అయితే ఈ పోస్టులను యూనివర్సిటీల ఆధ్వర్యంలో కాకుండా ఒక ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. త్వరలోనే ప్రభుత్వ సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే అధికారుల సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రత్యేక రిక్రూట్మెంట్కు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు 2, 3రోజులలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఉన్నత విద్యామండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై తుది నిర్ణయం జరుగుతూ జీవో విడుదలైన వెంటనే అన్ని యూనివర్సిటీలలో ఉన్న పోస్టుల భర్తీకి కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలా లేదా అన్ని అంశంపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీ పోస్టులు భర్తీ, రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు వంటి కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.