మలక్పేట, ఆగస్టు 24: ఉల్లిగడ్డ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన ఉల్లిగడ్డ మార్కెట్ (మలక్పేట-న్యూమార్కెట్)లో పదిరోజుల క్రితం రూ.15 నుంచి రూ.28 (కిలో) ధర పలికిన ఉల్లిగడ్డ .. శనివారం రూ.36 నుంచి రూ.46 వరకు ధర పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలుకుతోంది. మలక్పేట మార్కెట్లో హోల్సేల్గా క్వింటాల్ ఉల్లిగడ్డ రూ.3,800 నుంచి రూ.4,600 ధర పలుకుతుండగా, రిటైల్ మార్కెట్లో క్వింటాల్ రూ.5వేల వరకు ధర పలుకుతోంది. .హోల్సేల్ మార్కెట్లో రూ.38 నుంచి రూ.46 వరకు ధర పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్లో కిలో మేలైన ఉల్లిగడ్డ రూ.50 పైనే ధర పలుకుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం మలక్పేట మార్కెట్కు 15వేల నుంచి 20వేల బస్తాల ఉల్లిగడ్డ దిగుమతి అవుతుండగా, ప్రస్తుతం 12వేల నుంచి, గరిష్ఠంగా 19వేల బస్తాల ఉల్లిగడ్డ దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచిపోగా, కర్ణాటక నుంచి ఒకటి, రెండు లారీలు వస్తుండగా, సింహభాగం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతోంది.
పదిరోజుల క్రితం (ఈనెల 13న) మార్కెట్కు 21,594 బస్తాల ఉల్లిగడ్డ దిగుమతి అవగా, అందులో కనిష్ఠ ధర క్వింటాల్కు రూ.2,200 ధర పలుకగా, గరిష్ఠంగా రూ.3,200 ధర పలికింది. గురువారం (ఈనెల 20న) మలక్పేట మార్కెట్కు 12,328 బస్తాల ఉల్లిగడ్డ దిగుమతి అవగా, అందులో 11,128 బస్తాల ఉల్లిగడ్డ మహారాష్ట్ర నుంచే దిగుమతి అయ్యింది. కిలో ఉల్లిగడ్డ కనిష్ఠంగా క్వింటాల్కు రూ.3,000, గరిష్టంగా రూ.4000 నుంచి రూ.4600 ధర పలికింది. శనివారం మలక్పేట మార్కెట్కు 25,778 బస్తాల ఉల్లిగడ్డ దిగుమతి అవగా, అందులో 24,878 బస్తాల (70 లారీల) ఉల్లిగడ్డ మహారాష్ట్ర నుంచే రాగా, కర్ణాటక నుంచి 600 బస్తాలు(2 లారీలు), కర్నూలు నుంచి 300 బస్తాల(ఒక లారీ) తెల్ల ఉల్లిగడ్డ దిగుమతి అయింది.
పొరుగు రాష్ర్టాల నుంచే దిగుమతి
రాష్ట్రంలో ఉల్లిగడ్డ క్రయ, విక్రయాలకు ప్రధాన కేంద్రమైన మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ (గంజ్) కు రాష్ర్టంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ర్టాలైన ఏపీలోని కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డ దిగుమతి అవుతున్నది. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో ఉత్పత్తి అయ్యే ఉల్లిగడ్డ ఎక్కువకాలం నిల్వకు పనికిరారు. కానీ మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లిగడ్డ నాణ్యత ఎక్కువగా ఉండి నిల్వ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. రాష్ర్టానికి దిగుమతి అయ్యే ఉల్లిగడ్డలో సింహ భాగం మహారాష్ట్ర నుంచే వస్తుంది.
ఎల్నినో ప్రభావంతో..
ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల ఖరీఫ్ ఉల్లిపంటలో జాప్యం జరగటంతో సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్పై ఒత్తిడి పెరగటంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.నిత్యం వంటకాల్లో వాడే ఉల్లిగడ్డ ధరలు రెట్టింపు కావటంతో మధ్య తరగతి ప్రజలపై, అదనపు ఆర్థిక భారం పడుతుంది.
డిమాండ్కు సరిపడా నిల్వలు లేవు
గతేడాది ఏపీలోని కర్నూలులో అతివృష్టి కారణంగా ఉల్లిగడ్డ పంటలు, నిల్వచేసిన ఉల్లిగడ్డ బాగా దెబ్బతినటంతో రైతులు ఉల్లి సాగును గణనీయంగా తగ్గించారు. అదేవిధంగా కర్ణాటక, మాహారాష్ట్రలో అనావృష్టి కారణంగా తీవ్రమైన ఎండల వల్ల నిల్వచేసిన ఉల్లిపంటలు దెబ్బ తినటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గటం మూలంగా ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్కు తగినంతగా సరుకు దిగుమతులు, ఉల్లి నిల్వలు లేకపోవటంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో కర్నూలు నుంచి ఉల్లిగడ్డ పంటలు చేతికందే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఉల్లి దిగుమతి అయితే ధరలు తగ్గే అవకాశం ఉంది.
– నర్సింహారెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి