సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ముర్గీ చౌక్ పునరుద్ధరణ పనులకు కులీ కుతుబ్షా పట్టణాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. ముర్గీచౌక్ నిర్మాణ నమూనా చిత్రాలను బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్లో విడుదల చేశారు. చికెన్, మటన్ విక్రయాల కోసం 125 ఏండ్ల క్రితం కలిగిన కోళ్ల మండి (ముర్గీచౌక్)ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన ఈ మార్కెట్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 36కోట్లను కేటాయించింది. దిగువన మార్కెట్, పైఅంతస్తులో రెస్టారెంట్ ఉండేలా జీ +1 భవనాన్ని ఏడాదిన్నరలో నిర్మించేలా లక్ష్యం పెట్టుకున్నారు. అప్పటి వరకు మార్కెట్ను సమీపంలోని మైదానంలోకి మార్చారు.