సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఎంఎంటీఎస్ రైళ్లు నగర సరిహద్దులను చెరిపేస్తూ ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే భాగస్వామ్యంతో నడుస్తున్న మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్) లోకల్ సర్వీసులను ప్రారంభించి సోమవారంతో 18 యేండ్లు పూర్తి చేసుకుంది. నేటి నుంచి 19వ సంవత్సరంలోకి ఎంఎంటీఎస్ అడుగుపెట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీనిని సరిగ్గా 2003 ఆగస్టు 9న అప్పటి ఉప ప్రధాన మంత్రి ఎల్కే అద్వాని చేతుల మీదుగా ప్రారంభించారు. 50 కిలో మీటర్ల దూరాన్ని 31 నిమిషాల్లోనే చేరుకునే విధంగా లోకల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 107 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 66 నిమిషాలలోనే చేరుకునే విధంగా ఎంఎంటీఎస్ ఫేజ్-2తో నడుపుతున్నారు. నాటి నుంచి నేటి వరకు జంట నగరాల కోసం దాదాపు 121 ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 80 నుంచి 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ అందిపుచ్చుకున్న లోకల్ రైలు ప్రయాణం అతి చౌకగా సాగుతుంది. కేవలం గరిష్టంగా 10 కంటే ఎక్కువ ఛార్జీ ఉండటం లేదు.
దీంతో పేద, మధ్య తరగతికి చెందిన వ్యాపారులు, చిరు ఉద్యోగులు, యువత నుంచి లోకల్ రైలు ఎంతో ఆదరణ పొందింది. ఇందులో అనుకున్న సమయంలోనే గమ్య స్థానాలను చేరుస్తూ, ప్రయాణికుల మన్నలు పొందింది. గతేడాది ఫిబ్రవరి వరకు దాదాపు 4.95 లక్షల ప్రయాణికులు తమ గమ్య స్థానాలను చేరుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ లోకల్ రైలు వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లేక పోయినప్పటికీ.. జంట నగరాలకు చెందిన ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో జంట నగరాల పరిధిలో కేవలం 55 రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.