హైదరాబాద్ : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో ముందస్తు చర్యలలో భాగంగా మారేడ్పల్లి సీఐ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ (House arrest) చేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తన హెల్త్ బాగోలేదని, డాక్టర్ వద్ద అపాయింట్ మెంట్ ఉన్నదని వెళ్లాలని ఎమ్మెల్యే వివరించినా పోలీసులు వినలేదు.
కారు ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ దాడులు, ప్రతిదాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు. దాడులు చేయడం, రెచ్చ గొట్టడం వంటి చర్యలతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించ వద్దని పేర్కొన్నారు. సమస్యకు పరిష్కారం చూడకుండా అరెస్ట్ లు, అడ్డుకోవడాలు తగదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.