ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం బైరామల్గూడ జంక్షన్లో నూతనంగా నిర్మిస్తున్న లూప్లు, సెకండ్ లేవల్ ఫ్లై ఓవర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Sudhir Reddy) అన్నారు. ఎస్ఆర్డీపీ (SRDP) పనుల్లో భాగంగా నిర్మిస్తున్న లూప్లు, సెకండ్ లేవల్ ఫ్లై ఓవర్ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్డీపీ పనుల్లోని 47 ప్రాజెక్ట్లలో 36 ప్రాజెక్ట్లు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. బైరామల్గూడ జంక్షన్లో లూప్ల నిర్మాణం ద్వారా ఎల్బీనగర్, చంపాపేట, సాగర్ రింగ్రోడ్డు మార్గాల వైపు వెళ్లేందుకు ఈ లూప్లు ఉపయోగపడతాయని అన్నారు. ఔటర్ రింగ్రోడ్డు తరహాలో బైరామల్గూడ జంక్షన్లో లూప్ల నిర్మాణం జరుగుతోందన్నారు.
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 135 కోట్ల వ్యయంతో లూప్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ఈ లూప్లు పనులు పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు, ఎస్ఇ రవీందర్రెడ్డి, ఈఈ రోహిణి, డిఈ కార్తిక్, ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.