ఆర్కేపురం, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గొంతెత్తి కోట్లాడేది బీఆర్ఎస్సే ఎంపీలేనని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం సరూర్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ను గెలిపిస్తే పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతారని పేర్కొన్నారు. పార్లమెంట్లో బడుగు, బలహీనవర్గాల గళం వినిపించాలంటే తప్పనిసరిగా కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రాష్ట్రం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు మొత్తం లక్ష కోట్లు కాలేదని, కానీ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్ కుటుంబం కాళేశ్వరంలో లక్ష కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు, మూడు పిల్లర్లు కుంగిపోయ్యాయని, వాటిని రీపేర్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, డివిజన్ అధ్యక్షుడు మహేందర్, మాజీ డివిజన్ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ , ఏప్రిల్ 20 : బీసీ బిడ్డ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుని చేవెళ్లపై మూడో సారి గులాబీ జెండా ఎగురేస్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. కాసానితో పాటు కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస్రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, పార్టీ డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే గాంధీ తన నివాసంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నేతలు మోహన్ , రవీందర్, సంజీవరెడ్డి, రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.