రామంతాపూర్, జూలై 20 : రామంతాపూర్ పెద్ద చెరువు నుంచి వస్తున్న వరదనీటితో కాలనీలు మునగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పెద్ద చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా మోటార్ల ద్వారా వరదనీటిని తొలగించే పనులను పరిశీలించి.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో వరదనీటితో సాయిచిత్రానగర్, లక్ష్మీనగర్, రవీంద్రనగర్ తదితర కాలనీలవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెరువులో నీరు చేరుతుండటంతో ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. ఇప్పటికే నీటి తొలగింపు పనులు వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం.. ఈ విషయంలో వరదనీటిని తొలగించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. పెద్ద చెరువు నుంచి చిన్న చెరువు ద్వారా వరదనీటిని పైపుల ద్వారా మూసీలోకి వదిలేందుకు నిధులు వెచ్చిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక కాలనీ వాసులు కంచర్ల సోమిరెడ్డి, వెల్లంకి రవీందర్రెడ్డి, బాలవెంకట్, పి.నగేశ్, సోలిపురం జయచంద్రారెడ్డి, పరమేశ్వరాచారి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.