Minister KTR | ‘ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా..విశ్వనగరం కావాలన్నా.. బలమైన నాయకత్వం..స్థిరమైన బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం. కరెంటు, తాగునీరు, ప్రజా రవాణా మెరుగుపర్చుకున్నాం. వచ్చే టర్మ్లో 24 గంటల తాగునీరు, చెరువులు, డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకుందాం. 400 కిలోమీటర్ల మేర అదనంగా మెట్రోను విస్తరించుకుందాం. అమ్మలా అన్నంపెడుతున్న హైదరాబాద్ను కాపాడుకుందాం’. అని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని.. బీఆర్ఎస్ అభ్యర్థులు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్కు మద్దతుగా ప్రసంగించారు. తొమ్మిదిన్నరేండ్లలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే.. మళ్లీ మతకల్లోలాలే తప్ప.. అభివృద్ధి ఉండదన్నారు.
సిటీబ్యూరో, బంజారాహిల్స్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్లోని శ్రీరాంనగర్లో మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన రోడ్షోకు మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో మాగంటి గోపీనాథ్ పట్టున్న నాయకుడు, ప్రజా సేవకుడని.. కరోనా సమయంలోనూ గొప్పగా పనిచేశాడన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమంలో ముందుండే నాయకుడు మాగంటి అని చెప్పారు. బ్యాలెట్లో నాలుగు నంబర్ వచ్చిన కారు గుర్తుపై ఓటు వేసి మాగంటిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాదని..కాంగ్రెస్ అభ్యర్థి గొప్ప క్రికెటర్ కావొచ్చు..కానీ ప్రజా నాయకుడు కాదన్నారు.
అసలు అజారుద్దీన్ ఎప్పుడైనా జూబ్లీహిల్స్, శ్రీరాంనగర్, ఎర్రగడ్డ, బోరబండలో కనబడ్డాడా? ఎన్నికలు రాగానే అజారుద్దీన్ కనబడుతున్నడు..నాన్లోకల్ అయిన ఆయన మురాదాబాద్ను వదిలి ఎన్నికల కోసమే ఇక్కడకు వచ్చారని తెలిపారు. ఈ ప్రాంతానికి అజారుద్దీన్ వస్తే ఆయనతో క్రికెట్ ఆడండి..కానీ ఓటు మాత్రం మాగంటి గోపీనాథ్కే వేయాలన్నారు. తొమ్మిదిన్నరేండ్లు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, ప్రశాంత వాతావరణంలో ఉన్న హైదరాబాద్ను మళ్లీ కాపాడుకుందామని.. కాంగ్రెస్ వస్తే మళ్లీ మతకల్లోలాలు తప్ప అభివృద్ధి ఉండదన్నారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే చీకటి రోజులు కరెంట్ కోతలు, ఛార్జీల మోతలు తప్పవని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో కరెంట్, మంచినీటి సౌలత్ మెరుగుపర్చుకున్నామని, వచ్చే టర్మ్లో నిరంతర నీటి సరఫరాతో పాటు రహదారులు, డ్రైనేజీలు మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
యూపీలో చెల్లని అజారుద్దీన్..జూబ్లీహిల్స్లో చెల్లుతాడా? అసలు జూబ్లీహిల్స్లో ఏం తెలుసు? ఏ కాలనీ, బస్తీ తెలుసా? ఎన్నికల తెల్లారితే అజారుద్దీన్ ఇక్కడ ఉండడు..కానీ మాగంటి గోపీనాథ్ ఏ గల్లీకి రమ్మన్నా క్షణాల్లో వస్తాడు..సమస్యను పరిష్కరిస్తాడు? అలాంటి నాయకుడినే మళ్లీ ప్రజలు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ చెక్పోస్టు వద్ద..ఏర్పాటు చేసిన రోడ్ షోకు ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్తో కలిసి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉందని.. ఈ ప్రశాంతత కొనసాగాలన్నా? పెట్టుబడులు రావాలన్నా? విశ్వనగరం కావాలన్నా బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వమైన బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కరంట్, తాగునీరు, ప్రజా రవాణాను మెరుగుపర్చుకున్నామని చెప్పారు. వచ్చే టర్మ్లో 24 గంటల తాగునీరు, చెరువులు, డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకుందామని అన్నారు. 400 కిలోమీటర్ల మేర అదనంగా మెట్రోను విస్తరించుకుందామని పేర్కొన్నారు. సిలిండర్ ధరను రూ. 400లకే అందిస్తామని, ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పిస్తాం..అమ్మలా అన్నపెడుతున్న హైదరాబాద్ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
సింహం లాంటి సీఎం కేసీఆర్ను ఎదుర్కొనేందుకు గుంపులు గుంపులుగా ఎక్కడెక్కడి నుంచో దిగుతున్న నేతలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ బడా గణేశ్ చౌరస్తాలో ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షోకు మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. మంచి పని చేసిన కేసీఆర్ను కడుపులో పెట్టుకుని గెలిపించాలన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.
ఎక్కడో నుంచి రావాలి, పేపర్ మీద రాసింది చదవాలి.. ఢిల్లీ తిరిగి వెళ్లిపోవడమే రాహుల్ గాంధీ చేస్తున్న పని అని మంత్రి విమర్శించారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. అందరికీ అన్నం పెట్టే హైదరాబాద్ మంచిగుంటేనే తెలంగాణ మంచిగుంటదన్నారు. దానం నాగేందర్కు వేసే ప్రతి ఒక్క ఓటు కేసీఆర్ను మరోసారి సీఎం చేస్తుందన్నారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను మరోసారి గెలిపించాలన్నారు.