పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, విద్యావకాశాల కోసం ప్రతియేటా లక్షల సంఖ్యలో నగరానికి వలస వస్తున్నారని, ఫలితంగా మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నదని, దీనికి తగినట్లే ఏ నగరంలో చేయని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరవ్యాప్తంగా పరిశ్రమలు, జనావాసాల నుంచి నిత్యం 1950 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తవుతుంటే, ప్రస్తుతం జలమండలి 772 ఎంఎల్డీలను శుద్ధి చేస్తున్నదని చెప్పారు.
రూ.1280 కోట్లతో కూకట్పల్లి నాలా,మూసీ పరీవాహక ప్రాంతాల్లో 17 ఎస్టీపీలు నిర్మించే లక్ష్యం కాగా, తొలుత ఫతేనగర్ నాలాపై నిర్మించనున్న 100 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పుడు 40 శాతం మురుగును శుద్ధి చేసుకుంటున్నామని, భవిష్యత్తులో వందశాతం శుద్ధి చేసి నీటిని చెరువుల్లోకి పంపి ఆహ్లాదకరంగా మారుస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్మికమంత్రి మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు. -సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ)
హైదరాబాద్ వాసులకు ఏ మాటైతే ఇచ్చామో.. ఆ మాట ప్రకారం నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దుతాం. ఈ కార్యాచరణలో వెనుకడుగు వేసేది లేదు. మన పెద్దలు హైదరాబాద్ను ఎలా ఇచ్చిండ్రో.. అంతకు మెరుగైన హైదరాబాద్ను మన పిల్లలకు అందించేందుకు శాయశక్తులా ముందుకుపోతాం.
గతంలో తాగునీటి సమస్య ఎట్లుండేదో మనకు తెల్వనిది కాదు. ఖాళీ బిందెలతో ధర్నాలు లేవు. జలమండలి ముందు ప్రదర్శనలు లేవు. నగరవ్యాప్తంగా 90 శాతం తాగునీటి సమస్య తీర్చినం. మిగిలిన 10 శాతాన్ని కర్తవ్యంగా పూర్తిచేసి 100 శాతం నీళ్లందిస్తాం.
పారేయడం మానేయండి
నాలాల్లోకి ఇష్టానుసారం చెత్త, ప్లాస్టిక్బాటిళ్లు, పాడైన ఫర్నిచర్ వస్తువులు, పాత పరుపులు, దిండ్లు వేయడం మానేయండి. ఇట్ల వేస్తే ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టినా ఫలితం ఉండదు. నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజల సహకారం చాలా ముఖ్యం.
దేశంలో ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ మహా నగరంలో మురుగునీటి శుద్ధి జరుగుతున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలో ఎనిమిది ముఖ్య నగరాల్లో ఎక్కడా లేని విధంగా మన హైదరాబాద్లో 40శాతం మురుగును ప్రతి రోజు శుద్ధి చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్లో రూ.317 కోట్లతో 100 ఎల్ఎండీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సామర్థ్యంతో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
మొదటగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఎస్టీపీ ప్రాంగణంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలమండలి ఆధ్వర్యంలో ఫ్యాకేజీ-3 కింద తొలి విడతలో రూ.1280.87 కోట్లతో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో 17 మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ)ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీటి ద్వారా రోజుకు 376.5 ఎంఎల్డీల మేర మురుగును శుద్ధి చేయవచ్చని తెలిపారు. దీంతో మొత్తం ఉత్పత్తిలో దాదాపు 60శాతం శుద్ధి ప్రక్రియకు చేరువవుతున్నామని, ఇక్కడితో ఈ ప్రయాణాన్ని ఆపకుండా మరో 700 ఎల్ఎండీల నీటిని శుద్ధి చేస్తే 100 శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ ఖ్యాతి గడిస్తుందన్నారు. దశల వారీగా మిగిలిన ప్రాంతాల్లోనూ ఎస్టీపీలను నిర్మించుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరానికి, ఇక్కడి ప్రజల జీవనానికి ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమమన్నారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్ణణం కారణంగా దేశంలో ఏ మహానగరంలో లేనంతగా హైదరాబాద్లో నేడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన అవకాశాలు పెరగడంతో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ వస్తున్నారన్నారు.
దీంతో ఓఆర్ఆర్ లోపల, హైదరాబాద్కు నలువైపులా కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇండ్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడి జనాభా, ఇండ్లు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, ఇతర సంస్థలు అన్ని కలిపి రోజుకు 1950 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే)ల మురుగునీరు ఉత్పత్తి అవుతున్నాయని, ఇందులో 772 ఎంఎల్డీల మురుగును జలమండలి శుద్ధి చేస్తుందని కేటీఆర్ వివరించారు. ఇవి గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకి అక్కడి నుంచి కృష్ణానదిలోకి చేరి సముద్రంలో కలుస్తున్నాయన్నారు.
దేశంలో 50 లక్షల పైచిలుకు జనాభా కలిగిన మహా నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్లలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే ఎక్కువ శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ ఇది సరిపోదన్నారు. దాదాపు ప్రతి రోజు 1200 ఎంఎల్డీల మురుగునీరు ఇంకా మిగిలే ఉంటున్నాయన్నారు. గతంలో భోలక్పూర్లో మంచినీరు, మురుగునీరు కలిసిపోయి 9 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. భవిష్యత్తుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా మురుగునీటిని శుద్ధి చేశాకే నాలాలోకి వదలడం, అవే తిరిగి మూసీలోకి పోవడం అత్యంత ప్రాధాన్యం కలిగిన పని అన్నారు.
జలమండలి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్టీపీల నిర్మాణం నగర ప్రజల జీవనానికి సంబంధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 31 ఎస్టీపీలలో 17 ఎస్టీపీల పనులను ప్రారంభించుకున్నామని, మిగతా 14 ఎస్టీపీలను దశల వారీగా నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగు నీరు 94 శాతం శుద్ధి అయిన తర్వాత 6 గ్రావిటీల ద్వారా మూసీలోకి వెళ్తుందని.. ఈ మురుగును శుద్ధి చేయకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
చివరగా హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. నాలాల మీద ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టినా.. చెత్త, ప్లాక్టిక్ బాటిళ్లు, పాడైపోయిన ఫర్నిచర్ను వేయడం మానేస్తే గానీ ఆ నాలాలు బాగుపడవని అన్నారు. ప్రతి సంవత్సరం నాలాలు క్లీన్ చేసేటప్పుడు పరుపులు, దిండ్లు వస్తున్నాయని.. అవి కూడా అందులో పడేస్తే నాలాలు శుభ్రంగా ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
దయచేసి హైదరాబాద్ నగర ప్రజలందరూ ముఖ్యంగా నాలాల చుట్టూ ఉండే ప్రజలు భవిష్యత్తులో మన పిల్లలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఇందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదని, మీ సహకారం, తోడ్పాటు కావాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక కార్పొరేటర్ సతీశ్ గౌడ్, రాములు విజ్ఞప్తి మేరకు ఫతేనగర్లో ఉన్న దర్గా, గుడికి రోడ్డు మార్గం వేసేందుకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక జలమండలి ముందు ప్రదర్శనలు లేవని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్లో ఖాళీ కుండలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు లేవన్నారు. మంచినీటికి సంబంధించి 90 శాతం సమస్య పరిష్కారం అయ్యిందని, ఇంకొక 10శాతం మిగిలిందన్నారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తమదేనన్నారు. ఇప్పుడే మా మున్సిపల్ శాఖ కార్యదర్శి, మెట్రో వాటర్వర్క్స్ ఎండీలను అడిగితే మరో రూ.170 కోట్లు కేటాయిస్తే సరిపోతుందన్నారు.
మొన్ననే సీఎం కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి మేరకు శివారు ప్రాంతాలకు రూ.1200 కోట్లు ఇచ్చారు. వాటికి అదనంగా రూ.170 కోట్లు అతి త్వరలోనే మంజూరు చేస్తాం. ఇందులో కూకట్పల్లికి రూ.25 కోట్లు ఇస్తాం. వాటితో మంచినీటి సమస్యను 100శాతం పరిష్కరించే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటారని తెలిపారు.
నగరంలో 2007 తర్వాత (14 సంవత్సరాల తర్వాత) ఇంత పెద్ద ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నామని జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. రోజుకి 772 ఎంఎల్డీల మురుగు నీటిని 94 శాతం శుద్ధి చేస్తున్నామని, కొత్తగా నిర్మించే 31 ఎస్టీపీల ద్వారా మరింత మురుగును శుద్ధి చేయవచ్చని తెలిపారు.
వీటి నిర్మాణంలో అధునాతన టెక్నాలజీని వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.