సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ): మెట్రో రైలు ప్రయాణం ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. మెట్రో సేవల విస్తరణపై ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం… స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకొన్నది. ఆచరణలో ఏమాత్రం సాధ్యం కానీ హామీలతో మెట్రో వ్యవస్థను బలహీన పరుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రయాణికుల రద్దీ తగ్గగా, వచ్చే జనాలకు మెరుగైన రవాణా సేవలు లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రధానంగా అదనపు కోచ్ల కొనుగోళ్లు, రైళ్ల ఫ్రీక్వెన్సీ, ప్రయాణ సమయాల పొడిగింపు వంటి కీలక అంశాలను సర్కారు అటకెక్కించింది. ఫలితంగా రద్దీ వేళలలో మెట్రో ప్రయాణం నరక కూపంలా మారిందని వాపోతున్నారు.
నిర్వహణ గాలికి
మూడు కోచ్లను ఆరు కోచ్లకు పెంచుతామని గతేడాది ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అప్పట్లోనే లీజు ప్రాతిపదికన కోచ్లను తెప్పించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కానీ కాలం గడిచినా ఇప్పటి వరకు చర్చలు ముందుకు రాలేదు. కనీసం కొత్త కోచ్లను ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇక పెరిగిన రద్దీకి అనుగుణంగా సరిపడా రద్దీ లేదు. రాత్రి 11గంటలకే సేవలు నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులతోపాటు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం అర్థరాత్రి 12 గంటల వరకు కూడా రైళ్లను నడిపే సాహసం ప్రభుత్వం చేయడం లేదు.
రద్దీకి అనుగుణంగా..
మెట్రో రైళ్లలో రద్దీకి అనుగుణంగా సేవలను పెంచడంలో సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నది. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం కారిడార్లలో ఉదయం, సాయంత్రం రైలు ఎక్కాలంటే ప్రయాణికులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి. వాస్తవానికి రద్దీ కూడా గతేడాదితో పోల్చితే 10శాతం తగ్గింది. అయినా ఉన్న ప్రయాణికులకు సరిపడా సౌకర్యంగా మెట్రో ప్రయాణం లేదు.