సిటీబ్యూరో: స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శాఖలోనే రోజుల తరబడి ఇంజినీర్ల కుర్చీలాట జరుగుతోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారి రెండు వారాల కిందట భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బదిలీలు జరిపారు. అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో సస్పెన్షన్కు గురైన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కి బదిలీ బహుమతి ఇవ్వడం, జీవో నంబరు 38 ఉల్లంఘన తదితర అంశాలను ‘నమస్తే’ ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకువచ్చింది.
సీఎంవో కార్యాలయం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారిని మందలించడం..అలాగే ఈ బదిలీలను ట్రై కమిషనరేట్ల కమిషనర్లు తేలిగ్గా తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాత్రం ఈ బదిలీని నిలిపివేయాలని, పరిగణనలోకి తీసుకోవద్దంటూ సంబంధిత ఇంజినీరింగ్ విభాగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అందరూ బదిలీలు నిలిచిపోయినట్టేనని భావించారు..కానీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పనిచేస్తున్న ఈఈలు బదిలీ స్థానమైన జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేశారు.
ఇక్కడి నుంచి బదిలీ అయిన వారు రిలీవ్ కాకపోవడం, రిపోర్ట్ చేసిన వారికి పోస్టింగ్ దక్కకపోవడం మున్సిపల్ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నది. ట్రై కార్పొరేషన్ కమిషనర్ల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. జీహెచ్ఎంసీ, సీఎంసీ మినహా, మిగిలిన ఎంఎంసీ పరిధిలోని ఇంజినీర్లు గంపగుత్తగా రిలీవ్ అయ్యారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఈ బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇకడి ఇంజినీర్లను రిలీవ్ చేసేందుకు కమిషనర్ కర్ణన్ నిరాకరించడమే ఇందుకు కారణం. గడిచిన కొన్ని రోజులుగా కమిషనర్ సెలవులో ఉండడంతో బదిలీపై వచ్చిన వారు, బదిలీకి నోచుకున్న వారు అందరూ జీహెచ్ఎంసీలోనే కొనసాగుతుండడం గమనార్హం.