జవహర్నగర్, నవంబర్ 5: మ్యాట్రిమోనిలో నీ ప్రొఫైల్ను చూశా.. నేను ఐపీఎస్ అధికారిని, హోమ్ మినిస్ట్రీ శాఖలో పనిచేస్తున్నాను.. నీ వాయిస్ బాగుంది.. తొలి చూపులోనే నచ్చేశావ్.. నిన్నే పెళ్లాడుతా.. అంటూ ఓ యువతిని మోసం చేసేందుకు ఓ ప్రబుద్ధుడు పథకం వేశాడు. యువతికి అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించింది. విచారణలో యువకుడి మోసం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం ప్రకారం.. జవహర్నగర్కు చెందిన ఓ యువతి పెళ్లి కోసం ఆమె కుటుంబ సభ్యులు రెండు నెలల కిందట తెలుగు మ్యాట్రిమోనిలో ఫొటో, వివరాలు ఇచ్చారు.
మ్యాట్రిమోనిలో యువతి వివరాలు తెలుసుకున్న ఓ యువకుడు ఎనిమిది రోజుల కిందట ఆమెకు ఫోన్చేశాడు. మీ వాయిస్ చాలా బాగుంది.. మీరు చాలా అందంగా ఉన్నారంటూ చెప్పాడు. అంతటితో ఆగకుండా ఐపీఎస్ అధికారినంటూ అతడి ఫేక్ ఐడీ కార్డు, పే స్లిప్, అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అతడి మాటలపై యువతికి అనుమానం వచ్చి నిలదీసింది. దాంతో అతడి నిజస్వరూపం బయటపడింది. బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువతి భయంతో జవహర్నగర్ సీఐ భిక్షపతిరావును ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది.
వెంటనే స్పందించిన సీఐ విచారణ ప్రారంభించాడు. యువకుడు ఇచ్చిన వివరాలు ఫేక్ అని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు మిర్యాలగూడలోని హౌజింగ్బోర్డ్ కాలనీ వేంకటేశ్వరస్వామి టెంపుల్ వీధిలో నివాసముంటున్న ఉప్పుల హరిప్రసాద్ (29)గా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.