సిటీబ్యూరో/మాదాపూర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): అది కేంద్ర ప్రభుత్వ పథకం.. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 21 చోట్ల ఈ కార్యక్రమం జరగగా.. గ్రేటర్లో నాలుగు చోట్ల శంకుస్థాపన పనులు చేపట్టారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన శంకుస్థాపనలో స్వయంగా గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమ సభా వేదికపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆసీనులు కావడం ఒకింత విస్మయానికి గురి చేసింది.
కనీసం ప్రొటోకాల్ పాటించకుండా సభా వేదికపై కూర్చోవడం, ఏ హోదాలో కూర్చోబెట్టారో.. అంటూ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా గుసగుసలాడారు. ఇదొక్కటే కాదు.. నగరంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో అధికారికంగా ఏ హోదా లేని ద్వితీయ శ్రేణి నాయకులు హంగామా చేశారు. శేరిలింగంపల్లిలోని హఫీజ్పేట, హైటెక్సిటీ రైల్వే స్టేషన్లో బీజేపీ నేషనల్ టూరిజం డెవలప్మెంట్ అడ్వైజర్ గజ్జల యోగానంద్తో పాటు శేరిలింగంపల్లి బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టె డ్ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణ అనధికారికంగా విచ్చేసి రైల్వే నోడల్ అధికారి మధుసూదన్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజిగిరిలో ఎస్.రామచంద్రరావు సభావేదికపై పాలుపంచుకున్నారు.
ఇలా నగరంలో పలుచోట్ల జరిగిన అధికారిక కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు పిలవని పేరంటానికి వచ్చి హడావుడి చేయడమేంటని వాపోయారు. వేదికను పంచుకునే సందర్భంలో ఎలాంటి ప్రొటోకాల్ను పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నాంపల్లి రైల్వే స్టేషన్, మల్కాజిగిరి రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లలో జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ పార్టీ నాయకులదే హంగామా కనిపించిందని, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ప్రాధాన్యతనివ్వకుండా పార్టీ కార్యక్రమంగా మార్చివేసినట్లు పలువురు విమర్శిస్తున్నారు.